ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలి
45 ఏండ్లు దాటిన వారందరికీ కొవిడ్ టీకా వేయించాలి
కలెక్టర్ కే శశాంక
కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో జనాలు గుంపులుగుంపులుగా ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కరోనా నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాల్లో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీంలు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. తహసీల్దార్లు గ్రామాల వారీగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఉత్సవాలు, జాతరలు, వేడుకలు, వివాహాలకు ఎక్కువమంది హాజరు కాకుండా చూడాలన్నారు. శుభకార్యాలకు 50మంది వరకే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్ని గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ప్రధాన దవాఖానకు పంపించాలన్నారు. లక్షణాలున్న వారికి చికిత్స చేసే పీఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 45 ఏండ్లు దాటిన వారంతా టీకా తీసుకునేలా సర్పంచుల సహకారం తీసుకోవాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పీహెచ్సీల్లో చేయించాలని, వ్యాక్సినేషన్ సెంటర్లను దగ్గరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. 45 ఏండ్లు దాటిన వారందరికీ ఈ నెల 30లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జువేరియా, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.