ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు
నిత్యం 288 పడకలకు ప్రాణవాయువు సరఫరా
ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసా
దూరదృష్టితో వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు
కరీంనగర్, సిరిసిల్లలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు
కొత్తగా అందుబాటులోకి ఉత్పత్తి ప్లాంట్లు
పెద్దపల్లిలో ప్లాంటు కోసం ప్రతిపాదనలు
జగిత్యాలలో సిద్ధంగా నిల్వలు
కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) :కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో బాధితులకు ప్రభుత్వ దవాఖానలు అండగా నిలుస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా పేషెంట్లకు ‘ఊపిరి’పోస్తున్నాయి. రాష్ట్ర సర్కారు దూరదృష్టితో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులతోపాటు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు అందుబాటులోకి రాగా, పెద్దపల్లిలో ప్లాంటు కోసం ప్రతిపాదనలు పంపారు. జగిత్యాలలోనూ కొరత లేకుండా చూస్తుండగా, అన్నిచోట్లా ఆధునిక వైద్య సదుపాయాలతో రోగులకు ఉచితంగా మెరుగైన సేవలందిస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రాణవాయువు అందిస్తున్నారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా సర్కారు దవాఖానల్లో అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నది. కరోనా వేళ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. నియంత్రణకు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నది. ఎక్కడికక్కడ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నది. వైరస్ సోకిన వారికి సర్కారు దవాఖానల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నది. అందులో భాగంగానే ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో సుమారు ఆరు నెలల క్రితమే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేసింది. 21 టన్నుల కెపాసిటీ ఉన్న ఈ ట్యాంకును దవాఖాన వైద్యులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న తరుణంలోనే ఎక్కడా లేని విధంగా 1.10 కోట్లతో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ను ప్రారంభించింది. రోజుకు 3 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పుడు రోజుకు 1.5 టన్నులు ఉత్పత్తి చేస్తూ రోగులకు నేరుగా అందిస్తున్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లోనూ సోమవారం రాత్రి 12.84 టన్నుల ఆక్సిజన్ లోడ్ చేశారు. ఇప్పుడు ఈ ట్యాంకర్లో 17.84 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ దవాఖానలో మొత్తం 288 బెడ్స్కు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అందులో కరోనా చికిత్స పొందుతున్న 180 మందికి ప్రాణవాయువు అందిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 2 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇటు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా టన్ను, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ ద్వారా మిగతా ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో ఇప్పుడు ఆక్సిజన్కు ఎలాంటి కొరత లేదని, ఇప్పట్లో రాదని వైద్యాధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో కలిపి 2,200 బెడ్స్ వరకు ఉండగా, అందులో మంగళవారం నాటికి 1,212 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 500 మంది పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తున్నారు. 82 మందిని వెంటిలేషన్పై ఉంచారు. మిగతా వాళ్లు మామూలుగా చికిత్స పొందుతున్నారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించేందుకు కలెక్టర్ శశాంక ప్రత్యేక అధికారులను నియమించారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకునేందుకు ఇద్దరిని నియమించారు. వీరు సోమవారం రాత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
సిరిసిల్లలోనూ ఆక్సిజన్ ప్లాంట్..
సిరిసిల్ల ఏరియా దవాఖానలో 60 బెడ్లు ఉండగా, అన్నింటికీ ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారు. గతంలో రోగులకు సిలిండర్లతో ఆక్సిజన్ అందించగా, ప్రస్తుతం అధునాతన పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. ఈ దవాఖాన ఆవరణలో 6 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో 4,500 కిలో లీటర్ల ఆక్సిజన్ ఉన్నది. గతంలో నెలకు 6 టన్నుల ఆక్సిజన్ను తెప్పించి ట్యాంక్లో నింపారు. ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య పెరుగుతుండగా, 15 రోజులకొకసారి 6 టన్నులు తెప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ అందించేందుకు దవాఖాన ఆవరణలో 23 లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నిమిషానికి 1.40 లీటర్ల ఆక్సిజన్ను ఇది ఉత్పత్తి చేస్తుండగా, ఇటీవలే దీనిని ప్రారంభించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్, ఉత్పత్తి ప్లాంట్తోపాటు అదనంగా సిలిండర్లు అందుబాటులో ఉంచి సేవలందిస్తున్నారు.
పెద్దపల్లిలో ప్లాంటు కోసం ప్రతిపాదనలు
జిల్లాలో మొత్తం 150 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచారు. సుల్తానాబాద్ టీబీ దవాఖానలో 50, గోదావరిఖని ఏరియా దవాఖానలోని 50 పడకలకు సెంట్రల్ పైప్లైన్ బిగించి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. సుల్తానాబాద్ టీబీ దవాఖానలో 40, గోదావరిఖని ఏరియా దవాఖానలో 30 సిలిండర్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నారు. కరీంనగర్ నుంచి సిలిండర్లను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నారు. కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పెద్దపల్లి జిల్లా దవాఖానలో సైతం ప్రత్యేక నిధులతో 50 పడకలకు ఆక్సిజన్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లా వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
జగిత్యాలలో కొరతలేకుండా పర్యవేక్షణ
జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో 100 బెడ్స్ను కరోనా బాధితుల కోసం సిద్ధంగా ఉంచా రు. అందులో 50 బెడ్స్కు ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్ నుంచి ఎప్పటికప్పుడు సిలిండర్లు తెప్పిస్తూ కనీసం 48 గంటల ముందు స్టాక్ ఉంచుకునే ప్రయత్నం చే స్తున్నారు. కలెక్టర్, దవాఖాన సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆక్సిజన్ సిలిండర్లపై రివ్యూ చేస్తున్నారు.