హుజూరాబాద్, సెప్టెంబర్ 26: జమ్మికుంటలో శనివారం నిర్వహించిన రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ రెడ్డి కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఈటల వ్యాఖ్యలు అతడి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఈటల ఓడితే ప్రజలకు ఎలాంటి నష్టం లేదని, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. దళిత జాతిని ఆదుకునేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నవ శకానికి కేసీఆర్ నాంది పలికారని చెప్పారు. అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో వయసు సడలింపుతో నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈటల స్వార్థం, దురాలోచనతోనే ఉప ఎన్నిక అనివార్యమైందని ఆరోపించారు. సీఎం కావాలనే ఆశతోనే మధ్యలోనే రాజీనామా చేశాడని మండిపడ్డారు. అవినీతి, ఆరోపణలు వస్తే పదవి నుంచి తొలగించే అధికారం సీఎంకు ఉంటుందని, బీజేపీలో కూడా ఇటీవల 14మంది మంత్రులను పక్కన పెట్టినా వాళ్లు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏమీ చేయలేని ఈటల మళ్లీ గెలిస్తే ఏం ఒరగబెడతాడని ప్రశ్నించారు. పేదల సొంతింటి కలను కూడా నెరవేర్చకపోవడం అతడి చేతకాని తనానికి నిదర్శనమన్నారు.
కుల సంఘాల సమ్మేళనాలకు వస్తున్న జనాన్ని చూసి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి 20వేల మంది హాజరైతే జీర్ణించుకోలేని ఈటల ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చారని, వచ్చినవారంతా రెడ్లు కాదని రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించడం అతడి నీచ సంస్కృతికి తార్కాణమన్నారు. తన ఆత్మగౌరవం కన్నా ప్రజల ఆత్మగౌరవం గొప్పదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. ఆత్మగౌరవం ఈటలకు ఒక్కడికే ఉన్నదనుకుంటే పొరపాటేనని, అతడు పదవుల నుంచి తొలగించిన మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయ్కుమార్, రామస్వామికి కూడా ఉంటుందనే విషయం తెలుసుకోవాలన్నారు. డబ్బు, పదవుల అహంకారంతో ఎంతో మంది ని జైళ్లో పెట్టించిన నీచుడు ఈటల అని మండిపడ్డారు. ఆత్మీయ సమ్మేళనానికి అధికసంఖ్యలో తరలివచ్చిన రెడ్డి కులస్తులందరికీ, విజయవంతానికి కృషి చేసినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు చొల్లేటి కిషన్రెడ్డి, ఎడవెల్లి కొండాల్రెడ్డి, ఇరుమల్ల సురేందర్రెడ్డి, రావుల రాజలింగారెడ్డి, గూడూరి ప్రతాప్రెడ్డి, మూగల లక్ష్మారెడ్డి, దాసరి రమణారెడ్డి, మెరుగు కొండాల్రెడ్డి, గిసిడి కోమల్రెడ్డి తదితరులున్నారు.