జమ్మికుంట, సెప్టెంబర్ 26: స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ మున్నూరు కాపులకు సముచిత గౌరవం కల్పిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్, జల వనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించారని పేర్కొన్నారు. హైదరాబాద్లో మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనానికి ఐదెకరాల స్థలం ఇచ్చారని గుర్తుచేశారు. మున్నూరు కాపులంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీలో ఈటల ఎందుకు చేరాడు..
టీఆర్ఎస్లో పెద్ద పదవులను అనుభవించిన ఈటల.. బీజేపీలో ఎందుకు చేరాడో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తనను తాను రక్షించుకునేందుకే బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీకి చదరంగంలో పావులా మారాడాని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలతో రైతులపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. వడ్లు కొనమని చెబుతున్న బీజేపీ నేతలను ఇక్కడెలా తిరగనిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గరీబు బిడ్డ గెల్లు సీనును గెలిపించుకోవాలని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్, సారంగం, రాము, శ్రీలత, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.