హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్26: హుజూరాబాద్లో గెలిస్తే.. ఏం చేస్తదో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పాలి..? ముఖ్యంగా ఆ పార్టీ నేత రాజేందర్ చెప్పాలి..? తీయటి మాటలు ఓ వైపు, బొట్టు బిల్లలు, కుట్టు మిషన్లు పంచడం మరోవైపు.. ఇదేం రాజకీయం..?, దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నరు. దళితులకు ఎక్కడైనా ఒక లక్ష రూపాయలైనా ఇచ్చిన్రా..? మేం ఇచ్చినట్లు ఎక్కడైనా ఇస్తే చెప్పండి ముక్కు నేలకు రాస్తా’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి హుజూరాబాద్లోని ప్రతాప సాయిరెడ్డి గార్డెన్స్లో నియోజకవర్గస్థాయి వీఆర్ఏల ఆత్మీయ సమావేశానికి హాజరై, మాట్లాడారు. హుజూరాబాద్లో కాంగ్రెస్కు స్థానం లేదని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. అసలు పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అని చెప్పారు. రెండున్నరేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని, బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా..? రాజేందర్ మళ్లీ మంత్రి అవుతారా..? ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, హుజూరాబాద్కు సీఎం కేసీఆర్ నాలుగువేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసి ఇస్తే రాజేందర్ ఒకటైనా కట్టిండా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఒక ఇల్లు కూడా కట్టని వ్యక్తిగా రాజేందర్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. సీఎం ఇచ్చిన ఇండ్లు కట్టి ఉంటే పది వేల మంది ప్రజలు ఆత్మగౌరవంతో ఉండేవారు కదా..? అని ప్రశ్నించారు. ఏడేళ్ల బీజేపీ అధికారంలో రాష్ట్రానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. నల్లదనం రద్దు చేసి 15లక్షలు దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేస్తామని చెప్పి ఇప్పటికీ వేయలేదన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో ఉకు ఫ్యాక్టరీ ఇస్తామని ఏ ఒక్కటీ ఇయ్యలేదని మండిపడ్డారు. రాజేందర్ వీటి గురించి ఎకడా మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. మంచి చెడులు విశ్లేషించి, వాస్తవాలు ప్రజలు చెప్పాలని, చర్చ పెట్టి న్యాయాన్ని గెలిపించాలని వీఆర్ఏలకు మంత్రి సూచించారు.
రెండువేల కోట్ల ప్యాకేజీ తెస్తరా..?
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చినా రాజేందర్ కట్టలేదని, ఆ బాధ్యత మేం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఐదు వేల ఇండ్లు కట్టిస్తామని, సొంత జాగలో నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీజేపీ ఉత్త డైలాగులు, సెంటిమెంట్ మాటలు తప్ప.. గెలిస్తే ఏం చేస్తుందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుజూరాబాద్కు రెండు వేల కోట్ల ప్యాకేజీ తెస్తారా చెప్పాలని.. వాళ్లు చెప్పరు.. తేరు అని దుయ్యబట్టారు. అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఒక మాటలో అయినా నిజాయితీ ఉందా అని మండిపడ్డారు. ఉద్యమ బిడ్డ గెల్లును దీవించాలని వీఆర్ఏలను కోరారు. ఇక్కడ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, వీఆర్ఏల రాష్ట్ర అధ్యక్షుడు వై వెంకటేశ్యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు హజీజ్, వెంకటేశ్, లింగరాజు, ఎండి అన్వర్, మాజీ జిల్లా అధ్యక్షుడు చాతర్ల నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ, నియోజకవర్గ అధ్యక్షులు వి రాజేందర్, బోళ్ల రాజు,ప్రశాంత్, నరేష్, అంజలి, మార్క రామన్న, జూపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.