గోదావరిఖని, జూలై 26: సింగరేణి ద్వారా రామగుండానికి మెడికల్ కాలేజీ మంజూరుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో కొన్ని పార్టీల నాయకులు దానికి కేంద్రం నిధులు ఇవ్వదంటూ మాట్లాడడం సరికాదని 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్ పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రజలు గొర్రెలు, ఏది చెబితే అది నమ్ముతారంటూ చులకన భావంతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాపూర్ వద్ద 30 మంది వలస కార్మికులు గోదావరిలో చిక్కుకుంటే ఎమ్మెల్యే చందర్ వెళ్లి ఆ వలస కార్మికుల పిల్లలను తన భుజాల మీద ఎత్తుకొని వచ్చిం ది కనబడ లేదా అని ప్రశ్నించారు. అదే మంథని వద్ద గోదావరి ఉధృతి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్లో ఉంటే వరద బాధితులను పోలీసులు రక్షించారని వివరించారు. కేంద్రం నుంచి ఒక్క పైసా సాయం కోరకుండానే సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థలోని డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.200 కోట్ల బడ్జెట్తో మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ దిశగానే యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు. త్వరలోనే మెడికల్ కాలేజీ రానుందన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలే గాదు అన్ని వర్గాల ప్రజలు వైద్య విద్య కోసం ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఉండి అభ్యసించే రోజులు వస్తాయని వివరించారు. చందరన్న తాపత్రయం చూసి మంత్రి కేటీఆర్ రామగుండానికి ఐటీ టవర్ను తీసుకువస్తున్నారని, త్వరలోనే బసంత్నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటవుతుందని తెలిపారు. 1982 నుంచి నాలుగైదు సార్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఇప్పటివరకు రామగుండానికి ఏమైనా ఒరగబెట్టారా? అని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ప్రణీత్, సందీప్, వెంకటేశ్, రాకేశ్, శ్రావణ్, సన్నీ, కృష్ణ, శేఖర్, రాజయ్య, ప్రేమ్కుమార్, సారయ్య, ప్రభాకర్, అంజయ్య తదితరులు ఉన్నారు.