హుజూరాబాద్, అక్టోబర్ 25: బీజేపీ కవ్వింపు చర్యలకు దిగుతూ.. టీఆర్ఎస్పై కట్టుకథలు అల్లుతూ ప్రచారం నిర్వహిస్తున్నదని, ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదిహేను రోజులుగా కయ్యానికి కాలు దువ్వుతున్నారని, తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కమలాపూర్లో యాక్సిడెంట్ జరిగితే అది ప్రభుత్వ విప్ బాల సుమన్కు అంటగట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. చివరకు ఆ కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడిదని తేలగా మిన్నకుండి పోయారన్నారు. ఆ కారులో డబ్బు ఉందని ప్రచారం చేశారని, అది బీజేపీ నేతలదేనా? అని ప్రశ్నించారు. ఇల్లందకుంట మండలం సిరిసేడులోనూ టీఆర్ఎస్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిపై దాడి అంటూ నాటకాలు మొదలుపెట్టారని, అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలపైనే దాడి చేసి బాధితులపైనే కేసులు పెట్టించారని మండిపడ్డారు. నిన్న హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో బీజేపీ గూండాలు మంత్రి హరీశ్రావు వాహనాన్ని అడ్డుకొని దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. మంత్రి పర్యటనలో గందరగోళం సృష్టించడానికి ఒక టీవీ చానల్తో సహా పలువురు వచ్చారని చెప్పారు. ప్రతీ చోట గొడవ పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూశారని, కానీ టీఆర్ఎస్ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బీజేపీ నాయకుల తీరుందని మండిపడ్డారు. గతంలో బండి సంజయ్, దుబ్బాకలో రఘునందన్రావు ఇదే తరహాలో డ్రామాలు చేశారని, ప్రజలను అయోమయానికి గురి చేసి టీఆర్ఎస్పై కట్టుకథలు అల్లడమే వీరి పని విమర్శించారు. ఈటల రాజేందర్ కూడా రానున్న ఐదు రోజుల్లోగా ఏదో ఒక డ్రామాకు దిగే అవకాశం ఉందని, స్వీయ దాడులు చేసుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడని తమకు సమాచారం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి సానుభూతి డ్రామాలు నమ్మరని ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్నే భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు.
ఈటలా.. రెడ్డిలకు ఏం చేసినవ్?
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నువ్ రెడ్డిలకు ఏం చేశావని ఈటల రాజేందర్ను ఎమ్మెల్సీ పల్లా ప్రశ్నించారు. రెడ్డిలను చీల్చి ప్రయోజనం పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. రెడ్డి జేఏసీ పేరుతో పోతిరెడ్డిపేటలో గొడవ చేసింది బీజేపీ వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. ఏదో ఒక ఎత్తుగడతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఓట్లు సంపాదించాలనే నీచమైన కుట్రకు ఈటల తెరలేపాడని పేర్కొన్నారు. పోతిరెడ్డిపేటలో మంత్రి హరీశ్రావు కారును ధ్వంసం చేయాలని చూశారని, బయటి నుంచి కొందరిని తీసుకొచ్చి, రెడ్డిల ముసుగులో అల్లర్లకు దిగాలని ప్రయత్నిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని చెప్పారు. రెడ్డిల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు ఎంతో చేస్తున్నదని, వారి మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. పల్లా వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, నాయకులు చొల్లేటి కిషన్రెడ్డి, పోరెడ్డి శంతన్రెడ్డి తదితరులున్నారు.