హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 25: ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండమని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే.. మధ్యలోనే ఎందుకు రాజీనామా చేసినవో చెప్పి ఓట్లడగాలని ఈటల రాజేందర్ను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హుజూరాబాద్ మండలం చెల్పూర్, ధర్మరాజుపల్లి గ్రామాల్లో మహిళలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే బీజేపీ కావాల్నో.. ఉచితంగా కరెంట్ ఇస్తున్న టీఆర్ఎస్ కావాల్నో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. కేంద్రం నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచుతున్నదని, అలాంటి పార్టీలో తన ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ గుజ్జ జయసుధ, నాయకులు పోలంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఇరుమల్ల సురేందర్రెడ్డి, పంజాల సదానందంగౌడ్, నిమ్మ రాజయ్య, చిలుముల సత్తయ్య పాల్గొన్నారు.
బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 25: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిన బీజేపీకి ఉప ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. బిజిగిరిషరీఫ్లో నిర్వహించిన ధూంధాంకు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి హాజరయ్యారు. కళాకారులు తెలంగాణ ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈటలతో ఒరిగేదేం లేదని, టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, సర్పంచ్ రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాచపల్లి రాజయ్య, మాజీ సర్పంచుల అధ్యక్షుడు యుగేందర్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.