వీణవంక/ ఇల్లందకుంట/ ఇల్లందకుంట రూరల్, అక్టోబర్ 25 :ప్రతిపక్షాలు అవాకులు.. చెవాకులు పేలుతున్నయ్. అసత్య ప్రచారాలు చేస్తున్నయ్. దళితబంధుపై ఎలాంటి అపోహలు వద్దు. మీరు అడుగకున్నా మీ బతుకుల బాగు కోసం సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చిండు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పం. అలాంటి పథకాన్ని ఎట్ల ఆపుతం?. ఆరు నూరైనా కొనసాగిస్తం. ఎన్నికలైన తర్వాత నేనే దగ్గరుండి లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయిస్త. లేకపోతే నా పేరు మార్చుకుంట.
ఝూటా మాటల బీజేపీని నమ్ముతరా? అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇస్తున్న టీఆర్ఎస్ను ఆదరిస్తరా మీరే నిర్ణయం తీసుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. ప్రచారంలో భాగంగా సోమవారం వీణవంక మండలకేంద్రంతో పాటు చల్లూరులో జరిగిన రోడ్షోల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఇల్లందకుంట మండలం సిరిసేడులో నిర్వహించిన ధూంధాం, ఇల్లందకుంటలోని ఎస్సీకాలనీలో మాట్లాడారు. బీజేపీ వాళ్లు అన్నీ మొండి.. తొండి.. ఝూటా మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, గత యాసంగిలో రైతు పెట్టుబడి రూ.6 వేలు అయిందని, బీజేపీకి ఇంకా ఓటేస్తే రూ.8 వేలు అయితదని తెలిపారు. గెలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పాల్సింది పోయి.. క్రూడాయిల్ ధరలు పెరడగం వల్ల పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది ఎంత వరకు నిజమో ప్రజలు ఆలోచన చేయాలని, దీనిపై మాట్లాడడానికి జమ్మికుంట గాంధీచౌరస్తా, వీణవంక అంబేద్కర్ చౌరస్తా, చల్లూరు చౌరస్తా.. ఎక్కడికి వస్తారో రావాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ.100లో రూ.32 కేంద్రానికి పోతున్నాయని, ఏడేళ్లలో కేంద్ర పన్నులు రూ.4 నుంచి రూ.32లకు పెంచిన ఘనత బీజేపీ సర్కారుదేనని మండిపడ్డారు.
గ్యాస్ సిలిండర్ ధరపై ఈటలకు సవాల్ విసిరి పది రోజులైనా పత్తాలేడన్నారు. గ్యాస్ సిలిండర్పై మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్యాస్ ధర నవంబర్ వరకు రూ.1250 కాబోతోందని.. వచ్చే ఏడాది అయితే రూ.2 వేలు అవుతుందన్నారు. పేద ప్రజలపై ప్రేమ ఉంటే రూ.500 సబ్సిడీ ఇచ్చి, ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బీజేపీకి ఓటు వేయడమంటే మన వేలితో మనకన్ను పొడుచుకున్నట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్లో కేంద్రం రూ.5 వేలు ఇస్తున్నదని ఈటల రాజేందర్ అంటున్నారని.. అదే నిజమైతే వేరే రాష్ట్రంలో ఈ పథకం ఎందుకు లేదని ప్రశ్నించారు. యువకుల కష్టాలు యువకులకే తెలుస్తాయని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. పేదలకు, ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాజేందర్ను ఎన్నిసార్లు అడిగినా దీక్షలు చేసి ధర్నాలు చేసినా చల్లూరును మండలం చేయలేదని, గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే సీతారామచంద్రస్వామి సాక్షిగా మూడు నెలల్లో మండలం చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతదా.. నా పుణ్యాన విజయశాంతి ఎంపీగా గెలిచిందని తెలిపారు.
కేంద్ర మంత్రులు ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడగాలని, ఈటల ఝూటా మాటలను నమ్మొద్దని కోరారు. ఇల్లందకుంట మండలం బోగంపాడు నుంచి సీతంపేట రోడ్డు, పాతర్లపల్లి బ్రిడ్జి కావాలని ప్రజలు అడుగుతున్నారని, అవన్నీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లికి చెందిన జగన్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు ఎన్నికల ఖర్చు కోసం రూ.10వేలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పద్మాదేవేందర్రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, సర్పంచ్లు పొదిల జ్యోతి-రమేశ్, కాంతారెడ్డి, కోమల్రెడ్డి, చదువు లక్ష్మీమహేందర్రెడ్డి, సునీత-మల్లారెడ్డి, నీల కుమారస్వామి, వరలక్ష్మీస్వామి, పోతుల నర్సయ్య, రమేశ్, మోరె స్వామి, ఎండీ రఫీఖాన్, కలాల రాజిరెడ్డి, రాంమల్లయ్య, తిరుపతిరెడ్డి, మానస, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, సవిత-మల్లయ్య, స్వరూప-నర్సింహారెడ్డి, నల్ల మమత-తిరుపతిరెడ్డి, లక్ష్మీభూమయ్య, ఎక్కటి సంజీవరెడ్డి, మోటపోతుల ఐలయ్య, చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర్ర రమేశ్, టీఆర్ఎస్ నాయకులు వాసు, ముస్తఫా, మురళీ, తారక్, మహిపాల్, చంద్రమౌళి, రాజశేఖర్, శ్రీపాల్రెడ్డి, బిక్షపతి నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పాల్గొన్నారు.
ఈటలతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు
బీజేపీ అభ్యర్థి ఈటలతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లోనూ తనను ఓడించడానికి హైదరాబాద్, కరీంనగర్ నాయకులు కుట్రలు చేసి, ఈటల నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు, అందుకే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. మంత్రిగా ఉండి కూడా ఈటల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్యాదవ్కు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్తోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.