హుజూరాబాద్/ జమ్మికుంట, సెప్టెంబర్ 25: ‘ప్రాణాలు పణంగాబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. వచ్చిన తెలంగాణలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని పథకాలు ఇస్తున్నడు. అన్ని వర్గాలకు ఆదుకుంటున్నడు. అలాంటిది ఈటల రాజేందర్ కల్యాణలక్ష్మి పథకాన్ని దండుగన్నడు. దండుగన్న ఈటలకు ఓటెద్దామా..? ఆడబిడ్డకు ఆసరాగా నిలుస్తున్న టీఆర్ఎస్ను ఆశీర్వదిద్దామా..? తల్లులంతా ఆలోచించాలే. ఎటు వైపుంటరో చెప్పాలే.. సరైన నిర్ణయం తీసుకోవాలే. పథకాలిచ్చి అన్నం పెట్టి ఆదుకుంటున్న సర్కారుకు అండగుండాలే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక టీఆర్ఎస్ పార్టీ. గత ఆరుసార్లు కారు గుర్తుకే ఓటేసి గెలిపిచ్చిన్రు. ఈ రెండున్నరేళ్లకు మళ్లీ ఎన్నికలచ్చినయ్. గులాబీ కండువా కప్పుకొని మీ ముందుకు అచ్చిండు.. పేదింటి బిడ్డ గెల్లు సీను. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గెల్లును గెలిపించండి. అని రాష్ట్ర మంత్రి హరీశ్రావు కోరారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపసాయిగార్డెన్స్లో, జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో భూమి ఆధీన, విద్యుత్ కనెక్షన్, నీటి కుళాయి, ఇంటి అనుమతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలను ఆయా శాఖల అధికారుల ఆధ్వర్యంలో సంయక్తంగా నిర్వహించారు. హుజూరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో కలిసి, జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్లో 450 మంది పేదలకు ఇండ్ల పట్టాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, ఇతర అనుమతుల ధ్రువపత్రాలతో పాటు 72మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను పంపిణీ చేశారు. జమ్మికుంటలో సర్వే నంబర్ 887లో 177, 467లో 184మందికి పట్టాలు పంపిణీ చేశారు. అలాగే 35మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. తర్వాత ఆయా చోట్ల జరిగిన సమావేశాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకుని ఏళ్లకాలంగా నివసిస్తున్న పేదలకు పైసా ఖర్చు పెట్టకుండా అన్ని హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నాడు దరఖాస్తు పెట్టినా పనులు కాలేని సందర్భాలను వివరించారు. ఎప్పుడు కూలగొడతారో..? అని భయంతో బతికిన విషయాలను గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లేవని, మీరు నిర్భయంగా ఉండేలా ప్రభుత్వం పట్టాలను అందిస్తున్నదని చెప్పారు. ఇది కేసీఆర్ తీసుకున్న మరో చారిత్రాత్మక నిర్ణయం అని మంత్రి పేర్కొన్నారు. జాగ ఉండి ఇల్లు లేని ప్రతి ఒకరికీ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నీ చేస్తున్నదని, మరి బీజేపీ ఏం చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం మోపుతున్న ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పథకాలను పరిగె అన్న ఈటలను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. మోసపోతే గోస పడతరని పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్లో కరంటు సమస్యను తీర్చేందుకు రూ.కోటీ 50లక్షలతో సబ్ స్టేషన్ నిర్మాణం చేపడుతామన్నారు. హుజూరాబాద్ సంక్షేమం, అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపర్చాలని కోరారు.
పేదల సమస్యలకు సత్వర పరిష్కారం
మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్ ప్రజల సమస్యలను ఈటల రాజేందర్ పట్టించుకోలేదని, దశాబ్దాల తరబడి ఇంటి అనుమతి పత్రాల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేదల సమస్యలను తాము సత్వరమే పరిష్కరిస్తూ అండగా నిలుస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెకడా లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రాబోయే ఉప ఎన్నికలో కేసీఆర్కు అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకోవాలన్నారు. హుజూరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆర్డీవో రవీందర్రెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ బకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జమ్మికుంటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, ఆర్డీవో రవీందర్రెడ్డి, విద్యుత్ డీఈ విజేందర్రెడ్డి, ఏడీ శ్రీనివాస్రెడ్డి, ఏఈ సురేషాచారి, కమిషనర్ సుమన్రావు, కౌన్సిలర్లు, సిబ్బంది, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.