హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 427 మందికి ఆహ్వానం
గ్రామానికి, పట్టణాల్లో వార్డుకు నలుగురి చొప్పున హాజరు
ఉదయమే బయలు దేరనున్న వాహనాలు
పకడ్బందీగా పథకం అమలు కోసం పక్కా ప్రణాళిక
తీరు తెన్నులపై దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు నిర్ణయించిన ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అమలుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు వెలువడ్డాయి. కార్యాచరణ ప్రక్రియ సైతం ప్రారంభం కాగా, సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తొలి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 427 మందికి ఆహ్వానం అందింది. నేటి ఉదయం ప్రత్యేక వాహనాల్లో బయలుదేరేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. పథకం అమలు-తీరుతెన్నులు-లబ్ధి కల్పించే విధానం వంటి అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
యావత్తు రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో పేదరికాన్ని దూరం చేసి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గుణాత్మక మార్పులు తేవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. పథకం అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. పథకానికి సంబంధించి ఇప్పటికే జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంతేకాదు 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లతో సంక్షేమం కోసం ప్రతిపాదించిన ప్రభుత్వం.. తాజాగా, రూ.లక్ష కోైట్లెనా ఈ పథకం అమలుకు వెచ్చించనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. నిజానికి షెడ్యూల్ కులాల సంక్షేమం, అభివృద్ధి కింద ఇప్పటికే అనేక ప్రగతి కార్యక్రమాలు అమలవుతున్నాయి. అయితే, వీటితో సంబంధం లేకుండా తెలంగాణ దళిత బంధు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేసేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల చొప్పున నగదు సహాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో ఇవ్వనున్నట్లు సదరు జీవోలో ఇప్పటికే స్పష్టం చేసింది.
దిక్సూచిగా మారున్న హుజూరాబాద్
దళితుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు చేయాలని భావిస్తున్న ఈ మహత్తర పథకంవైపు అందరి చూపు మళ్లింది. ఇక్కడ జరిగే సర్వేలు, తీసుకునే నిర్ణయాలు, చేకూరే లబ్ధి వంటి వే కాదు.. ఎదురయ్యే అనుభవాలు, ఇబ్బందులన్నింటినీ అధిగమించి.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రూ.పది లక్షలను అందించేందుకు సాగే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, హేతుబద్ధంగా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను సర్వే కోసం వినియోగించనుంది. అంటే హుజూరాబాద్ గడ్డవేదికగా తయారయ్యే విధి విధానాలు యావత్తు రాష్ట్రంలోని దళితులందరికీ వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఒక దిక్సూచిగా నిలువనుంది.
నేడు అవగాహన సదస్సు
మహోన్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా అమలు చేయాలని నిర్ణయించిన దళిత బంధు పథకం అమలుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇందు లో భాగంగానే తొలి అవగాహన సదస్సుకు నేడు ప్రగతిభవన్ వేదిక కానుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం భారీగా కసరత్తు జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) అలాగే జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలక సంఘాల పరిధిలోని ప్రతి వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు పా ల్గొంటారు. అలాగే, 15 మంది రిసోర్సు పర్సన్స్ కూడా సమావేశానికి హాజరవుతారు. ముందుగా ఆయా మండలకేంద్రాల నుంచి హుజూరాబాద్కు చేరుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్ర హం వద్ద నివాళులర్పించి, ఆ తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన అల్పాహారం తీసుకొని.. నేరుగా హైదరాబాద్ ప్రగతి భవన్కు వెళ్తారు. ఇప్పటికే ఆహ్వానితులందరికీ అధికారుల ద్వారా సమాచారం అందింది. కేసీఆర్ ఆధ్యక్షతన రోజంతా అవగాన సదస్సు జరగనుంది. ఈ పథకంపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు. పథకం అమలుకు గల కారణాలు, ఇప్పటివరకు సాగిన అధ్యయనం, అమలు చేయబోయే విధానం, తద్వారా సదరు కుటుంబాల్లో వచ్చే గుణాత్మక మార్పులు చేర్పులు, సదరు కుటుంబాల్లో పెరిగే ఆత్మగౌరవం, ప్రతిపక్షాలు చేస్తున్న పసలేని ఆరోపణలు- వాటికి సమాధానాలతో పాటు లబ్ధిదారుల ఎంపిక కోసం జరిగే సర్వే వివరాలు, అధికారులతో సమన్వయం చేసుకునే విధానం వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించనుండగా.. పథకం అమలుకు పడుతున్న అడుగులను చూసి సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.