మరోసారి పార్టీని విమర్శిస్తే తరిమికొడుతాం
టీఆర్ఎస్ యూత్ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ ఘాటు విమర్శలు
హుజూరాబాద్టౌన్, మే 24 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ యూత్ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. 2004లో ఈటలను కమలాపూర్కు తీసుకువచ్చి నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు అన్నది ప్రజలకు తెలుసునన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి శాసనసభా పక్షనేతగా, తెలంగాణ వచ్చాక రెండు సార్లు మంత్రి పదవులు ఇచ్చారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో ఎక్కడా ఈటల రాజేందర్ని చిన్నచూపు చూడలేదని, ఆయన రాజకీయ ఎదుగుదలకు ఓ పక్క కమలాపూర్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు కారణమైతే ఉద్యమ నాయకుడు కేసీఆర్ మరో కారణమన్నారు. ఈటలను కుడి భుజంగా నమ్మి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడి అసైన్డ్ భూములను మోసపూరితంగా తీసుకుని అనుభవించారని మండిపడ్డారు. ఆత్మగౌరవం అని మాట్లాడే ఈటల నియోజకవర్గంలో నిజమైన నాయకులను పక్కన బెట్టి ఇతర పార్టీల నాయకులను దగ్గరకు తీసి వారు ఇచ్చే తాయిలాలకు ఆశపడి చైర్మన్గిరి కట్టబెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మొదటి మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్ టీఆర్ఎస్లో చేరి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే ఎక్కడ ఎదుగుతాడోనని ఆయనపై అవిశ్వాసం పెట్టి సాగనంపే ప్రయత్నం చేయలేదా? అని ప్రశ్నించారు. విజయ్కుమారే రాజీనామా చేసేలా ఒత్తిడి చేసి ఆయనను పార్టీకి దూరంగా ఉండేలా చేసింది ఈటల కాదా? అని ప్రశ్నించారు.
పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు పెద్దదిక్కుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావుపై అక్కసుతో ఆయన భార్య ఎంపీపీ సరోజినీదేవిపై పార్టీ వారితోనే ఆవిశ్వాసం పెట్టించే ప్రయత్నం చేయలేదా? అని గుర్తు చేశారు. కెప్టెన్పై అక్కసుతో హుజూరాబాద్ నాయకులపై ఒత్తిడి తెచ్చి పలుమార్లు పార్టీని రెండు వర్గాలుగా చీల్చే ప్రయత్నం చేయలేదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ దవాఖానలో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ సర్జన్ శ్రీకాంత్రెడ్డిని ఏ కారణం లేకుండానే ఈటల స్వార్థ రాజకీయం కోసం హుజూరాబాద్ నుంచి పంపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 2009లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్, వీణవంక, జమ్మికుంట మండలాలు కలిసినప్పుడు వాస్తవానికి అప్పటి శాసన సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సీటు అయినప్పటికీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈటలను హుజూరాబాద్కు పరిచయం చేసి ఆయన హుస్నాబాద్కు వెళ్లినట్లు గుర్తుచేశారు.
ఈటలను ఎదగనీయొద్దు అని కేసీఆర్, కెప్టెన్ అనుకుంటే అప్పుడే ఈటలకు ఏ సీటూ దక్కేది కాదన్నారు. పార్టీని, కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేసి, తాను కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్న ఘనత ఈటలకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కెప్టెన్ నాయకత్వంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పటిష్టంగా ఉందని చెప్పారు. కుటిల ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని, పార్టీ నాయకులను ఈటల విమర్శిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈటల, అతడి తనయుడి భూ భాగోతాలు రోజురోజుకూ బయటపడుతున్నా రాజేందర్ తప్పించుకునే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్పై, కెప్టెన్పై ఈటల, ఆయన అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, నియోజకవర్గంలో తిరుగకుండా తరిమికొడుతామని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ యూత్ఫోర్స్ జిల్లా కన్వీనర్ తిప్పరిశెట్టి శ్రీనివాస్, కో కన్వీనర్ తాటిపాముల కమలాకర్, నాయకులు భూపతి రాకేశ్, సాయివిశాల్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.