హుజూరాబాద్/ జమ్మికుంట చౌరస్తా/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 23;‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెలరోజుల్లో అచ్చే దిన్ వస్తున్నదని చెప్పి, ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి చచ్చే దిన్ తీసుకు వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నడు. పెట్రోల్, డీజిల్ ధరల మీద చర్చకు వస్తే.. నేనూ రాష్ట్ర మంత్రిగా సిద్ధం. ఎక్కడికి రావాల్నో చెప్పాలె. ఈ ధరల పెంపు పాపంలో ఎవరి భాగమెంతో తేలిపోతుంది. మొన్న ఈటలను రమ్మంటే పదిరోజులైనా రాలె. నువ్వైనా అదేంటో నిరూపించూ..’ అని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. శనివారం జమ్మికుంట మండలంలోని నాగంపేట, హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో నిర్వహించిన ధూంధాంలలో పాల్గొన్నారు. హుజూరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని, పార్టీ శ్రేణులు సంయమనంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ఎకరం అమ్మి గెలుస్తానని అహంకారంతో మాట్లాడుతున్నాడని, కానీ, మేం మాత్రం ప్రజల మనుసు గెలిచి విజయం సాధిస్తామని చెప్పారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 30న ఓటేసేందుకు వచ్చేముందు వంటింట్లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి బయల్దేరాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు ఓటేసి, ధరలు పెంచిన బీజేపీని బొందపెట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రుల నుంచి మొదలుకొని రాష్ట్ర నాయకత్వమంతా ఇక్కడికి వస్తున్నారని.. ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలపై నోటికొచ్చినట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. “పోయినేడు ట్రాక్టర్తో ఎకరం దున్నితే రూ.4 వేలైతే, మొన్నటి వానాకాలం రూ. 5 వేలైంది. ఇప్పుడు యాసంగికి రూ. 6 వేల ఖర్చు వచ్చేలా ఉందని పేర్కొన్నారు. ఇగ మళ్లీ ఆపార్టీకి ఓటేసి, ధరలు ఇలాగే పెంచుమని ప్రోత్సహిద్దామా..” అని ప్రజలను ప్రశ్నించారు. మనకు సాయం చేసే వారికి, మంచి చేసేటోళ్లకు, అన్నం పెట్టే నాయకత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అబద్ధాల బీజేపీకి, నమ్మకాల టీఆర్ఎస్కు మధ్య ఈ పోటీ జరుగుతున్నదని స్పష్టంచేశారు. “రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 2016 చేస్తనని చెప్పి, చేసి చూపిండు.. రైతుల కోసం రైతుబంధు ఏడాదికి ఎకరాకు రూ.10వేలు వేసిండు. కల్యాణలక్ష్మి ద్వారా రూ. లక్షా నూట పదహార్లు ఇస్తున్నడు.. ఇయ్యాల యాసంగికి కూడా సాగు నీరు ఇస్తున్నడు.. ఇదంతా సీఎం కేసీఆర్తోటే సాధ్యమైంది.
గతంలో మోటరు కాలితే రూ. 5 వేలు, బాయి పూడిక తీస్తే రూ. 30 వేలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రూ. 30 వేలు ఖర్చయ్యేది. వచ్చిన పంటంతా బాయి పొక్కలు తవ్వడం, బోర్లు వేసేతందుకే ఒడిసేది. మన ఆడబిడ్డల పుస్తెల కాన్నుంచి కుదువ పెట్టుకొని బావులు తవ్వుకునేది, తెలంగాణ వచ్చినంక ఈ తిప్పలు ఉన్నయా?” అని ప్రశ్నించారు. “కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజాప్రతినిధుల వేతనాలు ఆపి రైతుల కోసం రైతు బంధు కింద రూ.7500 కోట్లు ఇచ్చిండు. ఇయ్యాల తెలంగాణ సస్యశ్యామలం అయిందంటే కేసీఆర్ ముందుచూపే కారణం కాదా..?” అని పేర్కొన్నారు. “మహిళలకు వడ్డీ లేని రుణం పండుగ పూట ఇస్తే, చెల్లని చెక్కులని ఈటల మాట్లాడిండు.. మీకిచ్చిన చెక్కులు చెల్లినయా.. లేదా?” అని అక్కడున్న మహిళలతో సమాధానం రాబట్టారు. “అబద్ధాలతో లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నరు.. నేను సిద్దిపేటలో ఆరు నెలల కిందనే మా అక్కాచెల్లెండ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన.
మరీ నువ్వెందుకు ఇయ్యలేదో చెప్పు ఈటల అని ప్రశ్నించిండు. కేంద్రం నుంచి రోజుకొకరిని తెస్తున్నడు.. గ్యాస్ ధరల మీద ఆయన చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని పిలిస్తే పది రోజులైనా సమాధానం చెబుతలేడు’ అని ఎద్దేవా చేశారు. “అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్లే, పెట్రోల్, డీజిల్ ధర పెరిగిందని కిషన్ రెడ్డి చెబుతున్నరు. సర్చార్జీలు వసూలు చేసి రూ. 2 లక్షల 50 వేల కోట్లు జమ చేసుకున్నది కేంద్రం కాదా?” అని ప్రశ్నించారు. “ఇప్పటి వరకు మేం ఏం చేసినమో చెప్పినం. రేపు ఏం చేస్తమో చెబుతున్నం. మరి మీసంగతేంది?” అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఉత్తచేతులతో వచ్చి, అక్కరకు రాని ముచ్చట్లు మాట్లాడి వెళ్లిపోతున్నారని, కనీసం అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్ దీవెనలతో మంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు.