అబద్ధమైతే జమ్మికుంట చౌరస్తాకు చర్చకు రండి
టీఆర్ఎస్ తరుఫున మేం రెఢీ.. మీరు సిద్ధమేనా?
సవాల్ను స్వీకరించక తప్పించుకుని తిరుగుతున్నరు
దళిత జాతికి క్షమాపణలు చెప్పిన తర్వాతే ఓట్లకు రావాలే
తప్పుడు ప్రచారాలను తిప్పికొడ్తం
అఖండ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
సీఎం చేస్తున్న సంక్షేమం.. అభివృద్ధి పార్టీని గెలిపిస్తయ్
విలేకరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, అక్టోబర్23: ‘బీజేపీ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మితమైంది. అవి చెప్పే అధికారంలోకి వచ్చింది. అణగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చిండు. రూ.10లక్షలిచ్చిండు. దళితులు ఎక్కడ బాగుపడుతారోనని బీజేపోళ్లు దళిత బంధును ఆపిచ్చిన్రు. పైగా మేం ఆపలేదని చెప్తన్రు. బీజేపీల చేరిన ఈటల అదే అబద్ధాలతో తిరుగుతుండు. బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి ఏ పార్టీ నాయకుడో చెప్పాలే. ఆయన ఈసీకి రాసిన లేఖ ఇక్కడున్నది. ఇది నిజం కాదా..? దళిత బంధును ఆపలేదా..? అదే అబద్ధమైనే చర్చకు రండి. మేం రెడీ. జమ్మికుంట చౌరస్తాలో చర్చిద్దాం. ఇది మా సవాల్. దళిత బంధు ఆపడం వల్ల దళితులకు వ్యతిరేకమని మరోసారి నిరూపించిన్రు. సమాజం క్షమించదు. జాతికి క్షమాణ చెప్పిన తర్వాతే ఓట్ల కోసం రావాలే. రాజకీయాల్లో విలువలు లేకుండా జేస్తున్నరు. దళితుల పాపం వెంటాడుతూనే ఉంటది. తప్పుడు ప్రచారాలను ప్రజలే తిప్పికొడ్తరు. టీఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం. సంక్షేమం.. అభివృద్ధే పార్టీని గెలిపిస్తయ్..’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు అనేది ఎన్నికల కోసం ప్రవేశపెట్టలేదని, రెండు, మూడేండ్ల నుంచి సీఎం కేసీఆర్ దళిత బంధుపై మేధోమథనం చేశారని చెప్పారు. గొప్ప కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి.. వ్యతిరేకించడం.. తప్పుడు ప్రచారం చేయడం, దళితులకు కన్ఫ్యూజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అబద్ధాలతోనే గెలిచారన్నారు. నిన్నగాక మొన్న సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను కింద రూ.291 తీసుకుంటందని అన్నడు. ఇయ్యాలేమో రూ.21మాత్రమే తీసుకుంటందని చెప్తండు. బీజేపీ ప్రచారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఒక ఎన్నిక కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతారా..? అని ప్రశ్నించారు. బీజేపీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, తగిన గుణపాఠం ఓటుతో చెబుతారని చెప్పారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల వ్యతిరేక పార్టీ అని, బీజేపీని తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేదన్నారు.
పద్మశాలీలను పట్టించుకున్నడా..? మాజీ మంత్రి రమణ
ఈటలకు ఆస్తులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని, మంత్రిగా ఏనాడూ పద్మశాలీలను పట్టించుకున్న పాపానపోలేదని మాజీ మంత్రి ఎల్ రమణ ఆరోపించారు. టీఆర్ఎస్లో ఆయనకు దక్కిన గౌరవం మరెవరికీ దక్కలేదన్నారు. నిత్యం ధరలు పెంటుకుంటూ పోతున్న బీజేపీలో చేరిన ఈటల, ధరలు తగ్గించిన తర్వాతే ప్రజల్లోకి రావాలన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం బీసీ గణన కోసం రూ.7వేల కోట్లు కేటాయిస్తే.. ఇప్పటి వరకు గణన ఎందుకు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజకీయ జీవితానికి ప్రజలు ఘోరీ కడుతారని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ వీరేశలింగం, తదితరులు ఉన్నారు.