ప్రజలను బెదిరించే పార్టీ మీది
సంక్షేమం కోరే పార్టీ మాది
కిషన్రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నడు
కేసీఆర్ సభను కావాలనే అడ్డుకున్నరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కరీంనగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 2, 16, 17వ వార్డుల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుగా రైతుల సమస్యల పరిష్కారం కోసం 24గంటల ఉచిత కరెంటును ఇచ్చామని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను తెలంగాణ రాకముందు ఆలోచించినవేనని వివరించారు. ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతి పథకాన్ని ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేసుకున్నామని చెప్పారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం పేరుతో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని వినోద్కుమార్ గుర్తుచేశారు. రైతుబంధు పథకాన్ని హుజూరాబాద్లోనే ప్రారంభించామని, ఇపుడు దళితబంధును కూడా ఇక్కడే మొదలుపెట్టామని అన్నారు.
“ఇందులో ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా?, మాకు ఓట్లు వేయకుంటే రద్దు చేసే పథకాలు ఏమైనా ఉన్నాయా?” అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని వినోద్కుమార్ సూటిగా ప్రశ్నించారు. మొదట ఒక్క నియోజకవర్గానికే ఎన్నికల కోడ్ వర్తిస్తుందంటే పక్క నియోజకవర్గంలో కేసీఆర్ సభ కోసం వంద ఎకరాలు చదును చేయించామని, కేసీఆర్ సభను అడ్డుకోవాలనే కుట్రతోనే బీజేపీ నాయకులు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్తో ఉత్తర్వులు జారీ చేయించారని అన్నారు. ఇపుడు ఇతర జిల్లాలో కేసీఆర్ సభ పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్రం మొత్తాన్ని ఎన్నికల కోడ్ పరిధిలో చేర్చినా చేరుస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభపై కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశామని, స్పష్టత వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని వినోద్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ చౌర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు బర్మావత్ యాదగిరినాయక్, మక్కపెల్లి కుమార్యాదవ్, మారపల్లి సుశీల, ఉజ్మానూరిన్, నాయకులు గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.