ఉప ఎన్నికలో డిపాజిట్ రాకుండా చేయాలి
అమాత్యుడు కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట పట్టణంలో ప్రచారం
జమ్మికుంట, అక్టోబర్ 22: ‘దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపిచ్చిన్రు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళితబంధు గ్రౌండింగ్ అయితది. అందరికీ యూనిట్లు వస్తయ్. కానీ, ఇక్కడో విషయం తెలుసుకోవాలే.. మన కోసం పనిచేసేటోళ్లెవరు..? మనలను ఎదగనీయకుండా చేసేదెవరు..? తెలుసుకోవాలి. ఆలోచించాలే. దళిత వ్యతిరేకి బీజేపీని తరిమికొట్టాలే. ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేయాలె. 30న జరిగే ఉప ఎన్నికలో ఆ పార్టీకి దిమ్మదిరిగే గుణపాఠం చెప్పాలే. గెల్లు సీనును గెలిపించుకోవాలి..’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 11,12వ వా ర్డుల్లో ఎమ్మెల్యే నరేందర్తో, 6,9,19,27వ వార్డుల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ కోసం ప్రచారం చేశారు. ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీవాసులతో ముచ్చటించారు. ఇష్టాగోష్ఠి చేశారు. స్వరాష్ర్టాన్ని గొప్పగా ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని, తెలంగాణ రూపురేఖల్ని పూర్తి గా మార్చేసిన కేసీఆర్కు దేశాన్ని అప్పగిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టీఆర్ఎస్లో ఈటలకు దక్కిన గౌ రవం ఎవరికీ దక్కలేదని, పదవులన్నీ అనుభవించిన విషయాలను వివరించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల భూములను కొనుక్కుని, తన సమస్యను ప్రజలపై రుద్దారని దుయ్యబట్టారు. ఆస్తులు, అంతస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరాడని పేర్కొన్నారు. మంత్రిగా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని, ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లూ కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా అభివృద్ధి చేయని ఈటల, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఆయనకు గెలిచే అవకాశమే లేదని, పేదింటి బిడ్డ గెల్లు సీనునే గెలిపించుకుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తామని, మరో రెండున్నరేళ్లు అధికారంలో ఉండేది టీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు.
బీజేపీతో ప్రమాదం..
బీజేపీ ఇక్కడ గెలిస్తే ప్రజలకు ప్రమాదమని, ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు. ఈటల తన స్వార్థం కోసం రాజీనామా చేస్తే ఎన్నికలు వచ్చాయన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే హుజూరాబాద్ ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని తెలిపారు. గతంలో ఆరుసార్లు కారు గుర్తుకే ఓటేశారని, ఈ సారి కూడా కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలన్నారు. ధరలు పెంచుతూ పోతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రచారం సందర్భంగా కాలనీవాసులు టీఆర్ఎస్కే ఓటేస్తామని ప్రతినబూనారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. దళిత బంధు ఇచ్చిన సర్కారు వెంట నడుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు కళావతి, విజయలక్ష్మి, రాము, సారంగం, మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, నాయకులు, స్థానిక కాలనీవాసులు, తదితరులున్నారు.