ఉధృతంగా గోదావరి, మానేరు
ఉప్పొంగిన మోయతుమ్మెద, మూలవాగులు
పరవళ్లు తొక్కుతున్న ఎగువమానేరు
ఎస్సారార్ 22 గేట్లు, ఎల్ఎండీ 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
తిమ్మాపూర్/ బోయినపల్లి/ గంభీరావుపేట, జూలై 22:భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. గోదావరి నదితో పాటు మానేరు, మోయతుమ్మెద, మూలవాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. ఇప్పటికే ఎగువమానేరు నిండడంతో మత్తడి వద్ద పరవళ్లు తొక్కుతున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం 22 గేట్లు, ఎల్ఎండీ 12 గేట్ల నుంచి నీటిని వదులుతుండడంతో మానేరు దిగువకు పరుగులు పెడుతున్నది.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతున్నది. 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 10 వేల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ఫ్లో రూపంలో 9940 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ఇటు 25.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎగువమానేరు, మూలవాగు నుంచి 82,070 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 22 గేట్లు ఎత్తి 1,03,284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 24.034 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్ఎండీ 22 టీఎంసీలకు చేరుకున్నది. కాగా, శ్రీరాజరాజేశ్వర నుంచి 1,03000 క్యూసెక్కులు, మోయతుమ్మెద వాగు నుంచి 42,252 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,45252 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో గురువారం సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్ 12 గేట్ల ఎత్తి దిగువకు 62,468 వేల క్యూసెక్కుల వదిలారు. ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5,78,756 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 40 గేట్ల ద్వారా 6,79,090 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకు గానూ 18.452 టీఎంసీలు నీరున్నది. పార్వతీ బరాజ్లోకి 7,97,690 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండ గా, 68 గేట్లను ఎత్తి 7,96, 690 క్యూసెక్కులను ఔట్ఫ్లో రూపంలో వదులుతున్నారు.
వరదపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం
–మంత్రి గంగుల కమలాకర్
మానేరు పరీవాహక ప్రాంతం నుంచి ఎల్ఎండీకి వచ్చే వరదను నిమిష నిమిషానికి అధికారులు సమీక్షిస్తున్నారని, రిజర్వాయర్ నీటి మట్టం, ఇన్ఫ్లోను బట్టి గేట్ల ఎత్తివేత, మూసివేతపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఎల్ఎండీ గేట్లు ఎత్తిన అనంతరం ఆయన మాట్లాడారు. మానేరు వాగు పరీవాహక ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా, దిగువ ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం జలాలతో బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయని, సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఎక్కడా చూసిన జలాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, ఆర్డీఓ ఆనంద్కుమార్, ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, నాయకులు ఉన్నారు.