ప్రాజెక్టుపై వేగంగా కసరత్తు
ఆగస్టులో పనుల ప్రారంభం!
మొదటి విడుతలో 4 కిలోమీటర్ల మేర నిర్మాణం
తాజాగా హైదరాబాద్లో అధికారులతో మంత్రి గంగుల సమీక్ష
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 22 :మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇటీవలే 314కోట్ల నిధులు విడుదల చేయడమే కాకుండా, మొదటి విడుతలో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించే పనులను ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించగా, తాజాగా మంగళవారం హైదరాబాద్లో ఇరిగేషన్, టూరిజం శాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
కరీంనగర్కు ముఖద్వారంగా నిలిచే మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తి కావడంతో అవసరమైన భూసేకరణపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. అమెరికాకు చెందిన ఐకాం సంస్థ తన సర్వేను ఇప్పటికే 1.8 కిలోమీటర్ల మేర పూర్తి చేసినట్లు హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. వచ్చే నెల చివరినాటికి మాస్టర్ ప్లాన్తో పాటు డీపీఆర్ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. ఆగస్టు నుంచి నదిలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణంతోపాటు ఇతర సివిల్ పనులకు టెండర్లు పూర్తి చేసి, ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. గతం లో 5 లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చిందని, అయితే మధ్యమానేరు రిజర్వాయర్ మూలంగా ఇన్ ఫ్లో తగ్గిందని, భవిష్యత్తులో వచ్చే వరదను అంచనా వేసి నిర్మాణాలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
హైడ్రాలజీ రిపోర్ట్ ప్రకారం గత 500 ఏళ్ల వరద రిపోర్టు ఆధారంగా వానకాలంలో వచ్చే వరదను తట్టుకునే విధంగా వాల్స్ నిర్మాణాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బోటింగ్కు అనుగుణంగా రూపొందించడంతోపాటు అమ్యూజ్మెంట్ పార్కు, వాటర్ స్టోర్స్, లేజర్ షో, వాటర్ లైటింగ్, ఇతర ఫెసిలిటీస్ కల్పించేలా డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా మొదట నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 314 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. వీటితో పాటు 80 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం, 190 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ను సిద్ధం చేసి వేగంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా కరీంనగర్ నిలుస్తుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ కాడ్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్రావు, శంకర్, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.