జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 21 : పేదల భూములు గుంజుకున్న ఈటల కావాలో.. అడగకముందే అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన కేసీఆర్ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా గురువారం ఆయన జమ్మికుంట మండలం అంకుశాపూర్, మడిపల్లి, వెంకటేశ్వరపల్లి, గోవిందాపూ ర్ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మడిపల్లిలో ధూంధాంలో బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మొసలికన్నీళ్లు కార్చే బీజేపీ కావాలో లేదా ఆపదలో ఆదుకుంటున్న టీఆర్ఎస్ గెలువాలో నిర్ణయించుకోవాలన్నారు. పేదల కోసం దళితబంధు పెడితే దాన్ని ఆపేందుకు ఢిల్లీ నుంచి కుట్రలు చేసి లేఖలు ఆపివేశారని మండిపడ్డ హరీశ్రావు.. ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచే గెల్లు శ్రీనివాస్, ఆర్థిక మంత్రిగా నేను వచ్చి అందరికీ దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ చేసి, కొత్త వారందరికీ మంజూరు చేసి వెళ్తామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకాన్ని మొదట ఎస్సీలతోనే మొదలుపెట్టి అన్ని కులాలకు విస్తరింపచేశామని ఇప్పుడు దళితబంధు కూడా వారితో ప్రారంభించామన్నారు. మరి ఈటల గెలిస్తే ఏం చేస్తడో చెప్పమని అడుగాలె అని చెప్పారు. ఆయనకు ఆస్తుల మీదున్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు.
టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. మంత్రిగా పేదల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేని ఈటల.. రేపు మళ్ల గెలిపిస్తే ఉత్త ఎమ్మెల్యేగా ఏం చేస్తవో జెర చెప్పాలని ప్రశ్నించారు. ఇదే వేదికపై నుంచి చెప్తున్నా ఎన్నికల తర్వాత 5వేల ఇండ్ల కట్టించుడే కాదు, సొంత జాగలున్న వాళ్లందరూ ఇల్లు కట్టుకునేందుకు రూ.5.04 లక్షలు అందిస్తామని ప్రకటించారు. స్వార్థం కోసం రాజీనామా చేసి, ఎన్నికలు తెచ్చిన ఈటలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. మేం గెలిస్తే ఏం చేస్తమో ఇంత స్పష్టంగా చెప్తున్నామని మరి ఈటల గెలిస్తే నరేంద్రమోడీకి చెప్పి మా అక్కాచెల్లెళ్ల కోసం గ్యాస్ ధరను రూ.500 వరకు తగ్గిస్తడా? పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసి నీరా పాలసీ తీసుకొచ్చామని, రానున్న రోజుల్లో మోటార్ సైకిళ్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు పక్కా భవనాలు కట్టిస్తున్నమా? లేదా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ గెలిచినా, ఓడినా బీజేపీలో మాత్రం ఉండడట అని బీజేపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారని, కొందరు ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు రోడ్డు రోలరు గుర్తును, కోలపీట గుర్తును పెట్టుకుని తిరుగుతున్నారని, మన కారు గుర్తు పై నుంచి రెండోదని చెప్పారు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. వృద్ధులు ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు అక్కడ కారు గుర్తు గురించి అడిగి ఓటు వేయాలని విజ్ఞఫ్తి చేశారు.
బీజేపీ అంటే బట్టేబాజ్ ఝూటేబాజ్ పార్టీ
బీజేపీ అంటే బట్టేబాజ్ ఝూటేబాజ్ పార్టీ. ధరలు పెంచుడే తప్ప ఒరగబెట్టిందేమీలేదు. ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నది. అభ్యంతరకర భాష వాడుతున్నడు. ఏం మాకు తిట్లు రావా..? గిప్పటినుంచి మొదలువెట్టి రేపు గీయాళ్లదాంక ఆపకుంట తిడ్తం. అవేమన్న మనకు అన్నం పెడ్తయా..? అది మా సంస్కృతి కాదు. అభివృద్ధి, సంక్షేమం కావాలి. మరో రెండున్నరేళ్లు మేమే అధికారంలో ఉంటం. మేం పనులు చేసి ఓట్లడుగుతున్నం. మీ లెక్క పైసలిచ్చి ఓట్లడిగెటోళ్లం కాదు. మీ లెక్క గడియారాలు, కుట్టుమిషన్లు పంచలె. మేం చేసిందే చెప్తం. చేయబోయేది చెప్తం. అడుగకున్నా పేదల కోసం పథకాలు తీసుకొచ్చినం. రేపు తమ్ముడు గెల్లు సీనును గెలిపిస్తే మేం ఐదు వేల ఇండ్లు కట్టిస్తం. సొంత జాగా ఉన్నోళ్లకు సాయం చేస్తం. ఉగాదికి కొంచెం అటూ ఇటుగా రూ.లక్ష రుణ మాఫీ చేస్తం. ఎన్నికలు అయిపోగానే సీఎం కాళ్లు మొక్కయినా సరే వావిలాలను మండలంగా మారుస్తం. కానీ, ఈటల రాజేందర్ నువ్వేం చేస్తవో చెప్పు? కనీసం మోడీకి చెప్పి గ్యాస్ ధరైనా తగ్గిస్తవా..?
నీకు దేవరయాంజల్లోఆరు లక్షలకు ఎకురం దొరికిందా?
హైదరాబాద్లోని దేవరయాంజాల్లో ఆక్రమించిన భూములకు ఎన్వోసీ ఇవ్వనందుకే ఈటల రాజేందర్ ఇంత రాద్ధాంతం చేసిండు. రైతుల ఫిర్యాదుతో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశిస్తే.. గుమ్మడికాయ దొంగలెక్క భుజాలు తడుముకున్నడు. ఆ రోజు సాయంత్రమే ప్రెస్మీట్ పెట్టి ఆరు లక్షలకు కొన్నా అన్నడు. అయినా జమ్మికుంట చుట్టుపక్కల ఎకరం ఇరువై ముప్పై లక్షలుంటే.. అక్కడ అంత అగ్గువకు ఎట్లచ్చినట్టు? అంటే పేదల దగ్గర కొట్టేసినట్టే కదా..? విచారణ పూర్తికాక ముందే ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసిండు. ఎక్కడ తప్పు బయటపడుతుందోనని బీజేపీలో చేరి డ్రామాలాడుతున్నడు. నేను ఉద్యమంల పనిజేసినోన్ని. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినోన్ని. నన్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ను ఒప్పించి నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తెస్త.
ఆశీర్వదిస్తే.. మెడికల్ కాలేజీ తెస్తా..
హైదరాబాద్లోని దేవరయాంజాల్లో ఈటల రాజేందర్ ఆక్రమించుకున్న భూములను రెగ్యులరైజ్ చేసే విషయంలో ఎన్వోసీ ఇవ్వనందుకే ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. విచారణ పూర్తి కాకముందే ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశావని ప్రశ్నించారు. ఎక్కడ తన తప్పులు బయటపడి తలదించుకోవాల్సి వస్తుందనే బీజేపీలో చేరి సరికొత్త డ్రామాకు తెరతీశాడన్నారు. తాను 2001నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచానని చెప్పారు. 130 కేసులు తనపై పెట్టారని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే ముఖ్యమంత్రిని ఒప్పించి మెడికల్ కాలేజీ తెచ్చి, ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తానని తెలిపారు. వేల కోట్ల ఆస్తులున్న ఈటలకు, పేదబిడ్డకు పోటీ జరుగుతున్నదని అన్నారు. మీ ఇంటి బిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 1.3లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని రెండు నెలల్లో మరో 80వేల ఉద్యోగాల భర్తీచేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 22 జాతీయ బ్యాంకులుంటే అందులో 12 బ్యాంకులను మూసేసిందని మన వాళ్లు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయొద్దా అన్ని సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ అంటే బట్టేబాజ్, ఝూటేబాజ్ పార్టీ
బీజేపీ అంటే బట్టేబాజ్, ఝూటేబాజ్ పార్టీ అని, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుడు తప్ప ఒరగబెట్టిందేం లేదని మంత్రి తన్నీరు హరీశ్రావు దుయ్యబట్టారు. జమ్మికుంట మండలం విలాసాగర్, తనుగుల, శంభునిపల్లి, పాపక్కపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం అనంతరం వావిలాలలో రాత్రి ధూంధాం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఈటలకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. మేం మర్యాదగా మాట్లాడుతుంటే ఆయన మాత్రం అభ్యంతరకర భాషను వాడుతూ ‘చిరవకు రారా పోరా’ అనే స్థితికి తెగబడ్డాడని మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ గెలిస్తే మూడు నెలల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మూడేైండ్లెనా చెయ్యక మొండి చెయ్యి చూపాడని, అలాంటి వ్యక్తి మాటలు ఇక్కడ చెల్లుతాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని పట్టుకుని తిరుగుతున్న ఈటల కూడా ఇలాంటి వాడేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఉగాదికి కొంచెం అటూ ఇటుగా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణ మాఫీని మొత్తం పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. వావిలాలను మండలం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని, ఎన్నికల కోడ్ ముగియగానే ముఖ్యమంత్రి కాళ్లు మొక్కైనా సరే వామండలంగా చేస్తానని ప్రకటించారు. 30 ఎండ్ల కిందటే హైదరాబాద్కు బస్సు వేయిస్తే ఈటల రాజేందర్ ఉన్న బస్సును ఊడగొట్టిండని ఆరోపించారు. పండుగ ముందట వడ్డీలేని రుణాల కోసం చెక్కులు ఇస్తే చెల్లని చెక్కులు ఇచ్చిండని విమర్శించాడని, తాను ఇచ్చిన చెక్కులు చెల్లినవా? లేదా? అని అక్కడి మహిళలతో సమాధానం రాబట్టారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీపీ మమత, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, రాంబాబు, బండ రత్నాకర్రెడ్డి పాల్గొన్నారు.
వంతెన సమస్యను పరిష్కరిస్తాం:మంత్రి హరీశ్రావు హామీ
జమ్మికుంట ప్రజలకు ఇబ్బందిగా మారిన ఫ్లై ఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. మడిపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి జమ్మికుంట వైపు వస్తుండగా.. తన కోసం ఎదురుచూస్తున్న స్థానిక పిట్టలవాడకు చెందిన సుమారు వంద మంది మహిళలను చూసి మంత్రి తన కాన్వాయ్ను ఆపి దిగారు. సదరు మహిళతో కాసేపు ముచ్చటించారు. జమ్మికుంట రైల్వే వంతెన వల్ల తాము తీవ్రంగా నష్ట పోయామని, ఇప్పుడు మేం రైల్వే గేటు దాటాలంటే సుమారు రెండు కిలోమీటర్లు తిరగాల్సి వస్తున్నదని వివరించారు. తమ పిల్లల చదువులకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పకున్నారు. దాంతో మంత్రి స్పందించి, ఈ బ్రిడ్జి సమస్య నుంచి మీకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ల పెల్లి రాజేశ్వర్ రావు, మాజీ చైర్మన్ పొడేటి రామస్వామి ఉన్నారు.