జమ్మికుంట, అక్టోబర్20 :దళితబంధును ఆపింది బీజేపీనే. ఎన్నికల సంఘానికి లేఖ రాసింది వాళ్లే. ఈ నెల ఏడో తేదీన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాసింది నిజం. నేను రుజువు చేస్త. చర్చకు వచ్చే దమ్ముందా..? మేం లేఖ రాశామని ఈటల రాజేందర్ తప్పుడు ప్రచారం చేస్తున్నడు. మీరు రాశారా..? మేం రాశామా..? తేల్చుకుందాం. ధైర్యముంటే జమ్మికుంట గాంధీచౌక్కు రండి. ఎవరు వస్తారో రండి. అయినా దళితబంధును మహా అయితే ఏడు రోజులు ఆపుతరు అంతే. ఈ ఎన్నిక తర్వాత ఇక్కడ మేమే ఉంటం. అభివృద్ధి బాధ్యత తీసుకుంటం. నేను, కొప్పుల ఈశ్వర్ అన్న దగ్గరుండి ప్రతి కుటుంబానికీ దళితబంధు వర్తింపజేస్తం. దళితులందరికీ యూనిట్లు గ్రౌండింగ్ చేయిస్తం. పేదలకు ఐదు వేల ఇండ్లు కట్టిస్తం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సీనుకు ఓటేసి గెలిపించి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి.
బీజేపీ పేరు మారింది. జీడీపీగా మారింది. జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచే పార్టీ అయ్యింది. ప్రజల ఉసురు పోసుకుంటున్నది. ప్రజలకు సున్నం పెట్టే బీజేపీ వైపుందామా..? అన్నం పెట్టి ఆదుకునే టీఆర్ఎస్ వైపుందామా..? మీరే ఆలోచించాలే. ఉప ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకోవాలె. పేదింటి బిడ్డ గెల్లు సీనును గెలిపించుకోవాలె.’
ఐదేళ్లు అధికారంలో ఉండి సేవ చేయమని రాజేందర్కు ఓటేసి గెలిపిస్తే ఆయనేం జేసిండు.. నడమంత్రపు ఎన్నికలు తెచ్చిండు. ఆయన ఎందుకు రాజీనామా చేసిండో.. ఎందుకు పార్టీ మారిండో చెప్పడు.. సరే.. గెలిస్తే ఏం చేస్తడో అంతకంటే చెప్పడు. ఆయనకు ఆస్తుల మీదున్న ప్రేమ పేదల మీద లేదు. ఏమైనా సీఎం కేసీఆర్ను, మంత్రులను తిడుతడు. ఏం మాకు తిట్లు రావా? ఏంది. 24 గంటలు ఆపకుండా తిడ్తం. కానీ, అది మా సంస్కృతి కాదు. అభివృద్ధి, సంక్షేమం కావాలి. మరో రెండున్నరేళ్లు మేమే అధికారంలో ఉంటం. ఇప్పుడు అందిస్తున్న సంక్షేమం.. అభివృద్ధి మీ కళ్ల ముందున్నది.
‘దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ నాయకుడు ప్రేమేందర్రెడ్డే.. చర్చకు వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని మంత్రి హరీశ్రావు బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. పది రోజుల్లో ఉప ఎన్నిక పూర్తి అవగానే మళ్లీ పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తానే దగ్గరుండి దళితులందరికీ గ్రౌండింగ్ చేసి యూనిట్లు పంపిణీ చేస్తానని చెప్పారు. దళిత బంధు తరహాలోనే ప్రజలందరి కోసం మరో పథకం అమలు చేసేందుకు సీఎం ప్రణాళిక తయారు చేశారని తెలిపారు. బుధవారం సాయంత్రం జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తాలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి ఆయన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు లింగయ్య, ఎమ్మెల్యేలు చందర్, నరేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ మనలను ఆగం చేస్తున్నదని, ఈ నెల 30న కారు గుర్తుకు మరోసారి ఓటేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. గెల్లును గెలిపించిన తర్వాత నియోజకవర్గానికి తాను, మంత్రి కొప్పుల ఇద్దరం నెలకు రెండుసార్లు వచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జమ్మికుంటను సర్వాంగ సుంందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు రాజ్కుమార్, పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు మల్లయ్య, రాము, సారంగం, నరేశ్, విజయలక్ష్మి, శ్రీలత, కళావతి, నాయకులు కోటి, సమ్మిరెడ్డి హాజరయ్యారు. ధూంధాంలో కళాకారుడు సాయిచంద్ ఆట, పాటలు ఆకట్టుకున్నాయి.