ఉద్యమబిడ్డగా మీ బాధలన్నీ నాకు తెలుసు
నిండు మనసుతో ఆశీర్వదిస్తే మీ కష్టాల్లో తోడుంట..
ఒక్క కాల్ చేస్తే మీ ముందుంట
జమ్మికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్
జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 20 : ఈటల రాజేందర్ ఎక్కడో హైదరాబాద్ల ఉంటడు. ఆయనను కలువాలంటే అంత దూరం పోవాలె. వేల రూపాయలు ఖర్చు చేయాలె. నేను మీ మధ్యన పల్లెటూర్ల ఉంట. ఉద్యమబిడ్డగా మీ బాధలన్నీ నాకు తెలుసు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే కష్టాల్లో తోడుంట. ఒక్క కాల్ చేస్తే మీ కండ్ల ముందుంట. మీ సమస్యలను దూరం చేసేందుకు నా శక్తినంతా ధారపోస్త. నిత్యం హైదరాబాద్లో ఉండి మిమ్మల్ని అక్కడికి రప్పించుకునే నాయకుడు కావాలా..? నిత్యం ఇక్కడే ఉండి ఒక్క ఫోన్ కాల్తో మీ పనులు చేసి పెట్టే నేను కావాలా ఆలోచించండి. మీ కోసం, మీ బిడ్డల బాగు కోసం నన్ను దీవించండి.
రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ కావాలా?, అబద్ధాలతో మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న బీజేపీ కావాలా? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రజలకు సూచించారు. బుధవారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావుతో కలిసి జమ్మికుంట పట్టణంలోని 1, 2, 13, 14న డివిజన్లలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాను ఇంటింటా ప్రచారం చేస్తున్న సమయంలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ కనిపించారని, కనీసం చేతిలో డబ్బులు లేక.. దూర ప్రాంతాలకు వెళ్లలేక చికిత్స చేయించుకోలేని దుస్థితిలో మగ్గుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి ఇక ముందు ఎవరికీ రాకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి హుజూరాబాద్లోనే ఓ మెడికల్ కళాశాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంటే మన ప్రాంతం వారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని వెల్లడించారు. గతంలో పేదల కోసం సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే, ఈటల రాజేందర్ ఒక్కటి కూడా కట్టించకపోవడం విచారకరమన్నారు. తాను గెలిచిన తర్వాత సొంత జాగలు ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీలు, పేదలు, బీసీలపై ఈటలకు ప్రేమలేనే లేదని, బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని నిలుపుదల చేయించాడని మండిపడ్డారు. ఉద్యమకాలంలో తనపై 130కి పైగా కేసులు నమోదైనా భయపడకుండా, పట్టువీడకుండా ముందుకు నడిచానని గు ర్తు చేశారు.నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తానని చెప్పారు. అధర్మంగా ఆస్తులు కూడబెట్టుకొని, పైసలతో ఓట్ల కోసం వస్తున్న ఈటలను పక్కన పెట్టి, ధర్మ మార్గంలో నిరుపేదగా చేతు లు జోడించి అడుగుతున్న తనకు అవకాశం ఇవ్వాలని గెల్లు కోరారు.
గొర్రె పిల్ల మీద తోడేళ్ల దాడి జరుగుతోంది..
తనకు ఆస్తులు, అంతస్తులు, వ్యాపారాలు లేవని, వేల కోట్లున్న ఈటల తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాడని, కోటీశ్వరులు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారని, గొర్రె పిల్ల మీద తోడేళ్ల మంద దాడి చేసినట్లు చేస్తున్నారని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. అయినా పేదింటి బిడ్డగా మెదులుతానని, కేసీఆర్ సారు తనకు పేదోళ్ల బాధలు తెలుస్తయని చెప్పి ఇక్కడికి పంపారని, గెలిపిస్తే ఈటలలాగా పార్ట్టైంగా కాకుండా.. ఫుల్ టైం ప్రజా సేవలో ఉంటానని స్పష్టం చేశారు. జమ్మికుంటకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని, పర్యాటక కేంద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్, డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం సీఎంతో మాట్లాడుతానని, జమ్మికుంటకు మరో వందేళ్లపాటు ఇబ్బందులు రాకుండా మాస్టర్ ప్లాన్ అందిస్తానని చెప్పారు.
గుణపాఠం చెప్పాలె..
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గెల్లు గెలిస్తే హుజూరాబాద్లోనూ అదే తరహాలో అభివృద్ధి జరుగుతుంది. ఈటల రాజేందర్ తన వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత లాభంతో తప్పులను తప్పించుకోడానికి బీజేపీలో చేరి ఉప ఎన్నికను తెచ్చిండు. అలాంటి అవినీతి నాయకుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాల్నా..? పేదింటి బిడ్డ, నిజాయితీపరుడు అయిన గెల్లు సీను ఎమ్మెల్యేగా ఉండాల్నా..? మీరే ఆలోచించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదలను అరిగోస పెడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి.