జనాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తవ్ రాజేందర్
వంద సార్లు చెబితే అబద్ధం.. నిజమైపోదు
బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
హుజూరాబాద్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 20: ఎన్నికలు వస్తయ్, పోతయ్ కానీ, ప్రజల ప్రాణాలతో ఎందుకీ రాజకీయాలు? ఎన్నికలు దగ్గరపడుతున్న టైమ్లో అమాయకులను ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఈటల మాట్లాడుతున్నడు. సానుభూతి కోసం డ్రామాలు చేస్తున్నడు. పాదయాత్ర పేరుతో కాలినొప్పని, ఆపరేషన్ అని ఓసారి.. తన కారుపై తానే దాడి చేయించుకొని మరోసారి టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లిండు. జనాలను రెచ్చగొట్టేలా వీడియోలు తీయిస్తూ కొత్త నాటకం ఆడుతున్నడు. గ్యాస్ ధర మీద మంత్రి హరీశ్రావు సవాల్ చేస్తే సమాధానం చెప్పకుండా తోకముడిసిండు. కనెక్షన్ లేకున్నా కరెంట్ కట్ చేసిన్రని బట్టకాల్చి మీదేసిండు. వంద సార్లు చెప్తే అబద్ధం నిజమైపోదు. ప్రజలారా బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దు. మరోసారి మోసపోయి గోసపడద్దు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సానుభూతితో గెలిచేందుకు బీజేపీ నేత ఈట ల కుట్రలు చేస్తున్నాడని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమాయకులను ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఈటల మాట్లాడుతున్నాడని, నిస్సిగ్గుగా టీఆర్ఎస్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్కు లేఖ రాసి దళితబంధును నిలిపివేయించిన ఈటల, ఇప్పుడు మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంట్ కట్ చేశారని ఓసారి, రాష్ట్ర ప్రభుత్వమే రూ.291 గ్యాస్ సిలిండర్కు పన్ను వసూలు చేస్తున్నదని మరోసారి అసత్య ఆరోపణలు చేసి అడ్డంగా బుక్కయ్యాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నిరూపించాలని, లేదంటే పోటీ నుంచి తప్పుకోవాలని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరితే, ఇప్పటికీ స్పందించలేదన్నా రు. ఉప్పల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే, దానికి కారణం తన కారంటూ.. తన తమ్ముడు డబ్బులతో వెళ్తున్నాడని ఆరోపణలు చేసిన ఈటల, తీరా ఆ వాహనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అనుచరుడిదేనని తెలిసి తోక ముడిచాడని మండిపడ్డారు. ఇలా టీఆర్ఎస్పై బురదజల్లాలని చూస్తున్నాడని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన నాయకుడి న్యూస్ చానల్ వ్యాన్ లో కుట్టుమిషన్లు రవాణా చేస్తూ అడ్డంగా దొరికి, టీఆర్ఎస్సే ప్రలోభపెడుతున్నదని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారుపై తానే దాడి చేయించుకొని, టీఆర్ఎస్పై నిందలు వేసే ప్రయత్నం చేశాడని, నిజం బయటపడడంతో మిన్నకున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో ఆ పార్టీ నాయకులు రాజాసింగ్, రఘునందన్రావు, బండి సంజయ్ ఇలాంటి డ్రామాలతో సానుభూతి పొంది గెలుపొందారని గుర్తు చేశారు. ఈటలతో రేవంత్రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడని, ఇందులో బల్మూరి వెంకట్ను బలిపశువుగా మార్చారని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
అహంకారంతోనే ఈటల కుట్రలు : విప్ గువ్వల
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏదైనా చేయొచ్చనే అహంకారంతో ఈటల కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. అమాయకుల జీవితాలతో ఆటలాడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ప్రలోభాలు ఎరవేసి జనాలను రెచ్చగొడుతున్న బీజేపీ నాయకుల తీరును ప్రజలు గమనించాలని, దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం : సుంకె
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓటమికి కుట్రపూరితంగా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే పథకాలు వస్తున్నాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందని, అందుకే మోకాలు ఆపరేషన్ చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబం ధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు ఎన్నికలప్పుడు పెట్టినవేనా? అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనే రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించినప్పుడు ఈటల మంత్రిగా ఉండి చప్పట్లు కొట్టి, నేడు తన వల్లే దళితబంధు వచ్చిందని చెప్పుకోవడం ఆయన వక్ర బుద్ధికి నిదర్శనమన్నారు. మాల మాదిగలు అంటే ఈటల, ఆయన కుటుంబీకులకు చిన్న చూపని, అతడి బామ్మర్ది కూడా కించపరుస్తూ ఆడియోలో అడ్డంగా దొరికాడని గుర్తు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆత్మహత్యలు చేసుకునేలా దళితులను ప్రేరేపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు వచ్చే నెల నాలుగు నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా పంపిణీ చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 17,500 కుటుంబాలకు దళితబంధు డబ్బులు గ్రౌండింగ్ చేశారని, మరో 2, 3వేల మందికి ఎన్నికల అనంతరం గ్రౌండింగ్ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.