పదిరోజుల ముందే ప్రారంభం
నిమగ్నమైన అధికార యంత్రాంగం
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 20: పెద్దపల్లి జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యేడు పదిరోజుల ముందే కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం తెల్లబంగారం సేకరణలో నిమగ్నమైంది. ఈ నెల 7న కలెక్టర్ సంగీత సర్వేసత్యనారాయణ అధికారులతో సమావేశమై ప్రభుత్వ నిబంధనలు, కొనుగోలుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి రైతులు పండించిన పంటమొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.
గతేడాదితో పోల్చుకుంటే రైతులు ఈ యేడు అత్యధికం గా జిల్లావ్యాప్తంగా 63,715 ఎకరాల్లో పత్తి వేశారు. ప్రతి సంవత్సరం దీపావళి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేవారు. ఈ సారి ముందే పంట చేతికి వస్తుండడంతో పది రోజుల ముందే పత్తిని సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెద్దపల్లి వ్యవసాయమార్కెట్తో పాటు వివిధ మండలాల్లోలోని పలు జిన్నింగ్ మిల్లుల్లో మంగళవారమే కొనుగోళ్లు ప్రారంభించారు. దీపావళి తర్వాత అన్ని మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టనున్నారు.
అంచనాలకు మించి దిగుబడి..
పెద్దపల్లి జిల్లాలో 65,715 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, 6 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి మండలంలో 4,553 మం ది రైతులు 6,476 ఎకరాల్లో పత్తి వేశారు. తేమ 8 శాతం ఉంటే రూ.6,025, 12 శాతం ఉంటే రూ.5,784 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు మాత్రం సీసీఐతో పోల్చుకుంటే అత్యధికంగా ధరలు నిర్ణయించి దాదాపు రూ.6500 వరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, రాఘవాపూర్, నిమ్మనపల్లి గ్రామాల్లో, సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మూడు జిన్నింగ్ మిల్లులు, కమాన్పూర్ మండలం గొల్లపల్లిలో జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పటికే పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, అప్పన్నపేట, నిమ్మనపల్లి, కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామాల్లో గల మిల్లుల్లో , పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో డిమాండ్ మేరకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పత్తి రైతులకు మద్దతు ధర రూ.6025 లభించని పక్షంలో వెంటనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని రంగంలోకి దించి పత్తి కొనుగోళ్లు చేపట్టేలా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టింది. దీపావళి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. కాగా బుధవారం గరిష్టంగా క్వింటాల్ పత్తికి రూ. 7,100 ధర పలికింది.