త్రిదండి చినజీయర్ స్వామి
మల్కపేటలో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
పాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్బాబు, మాజీ న్యాయశాఖ మంత్రి ఆనందరావు
కోనరావుపేట, ఆగస్టు 20: భగవంతుడిపై దృష్టి కేంద్రీకరిస్తే అద్భుతమైన శక్తి వస్తుందని, సమాజంలో ప్రాణకోటిని రక్షిస్తూ, వాటి పట్ల ఉదారంగా ఉండడమే జీవన పరమార్థమని త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ చినజీయర్స్వామి ప్రబోధించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో చల్మెడ జానకీదేవి మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.3కోట్లతో కోదండ రామస్వామి ఆలయం నిర్మాణానికి ఎమ్మెల్యే రమేశ్బాబు, మాజీ న్యాయశాఖ మంత్రి చల్మెడ ఆనందరావు కుటుంబీకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా చిన్నజీయర్ స్వామికి చల్మెడ కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడి నిర్మించే స్థలంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఆనందరావు పుట్టిన ఊరిలో గుడి, బడి నిర్మించడం ద్వారా ఆ పని శాశ్వతమైన ఉపకారంగా మిగులబోతుందన్నారు. మల్కపేట రిజర్వాయర్ గుట్ట వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో రాముడు రావడంతో పవిత్ర నిలయంగా విరాజిల్లబోతుందన్నారు. దైవాన్ని స్మరిస్తూ దైవ భావన ఉన్నప్పుడే సృష్టిలో అనుకున్నది సాధ్యమవుతుందని, అందుకు ఆనందరావు పూనుకున్నారని వివరించారు. ఈ ప్రాంతం రానున్న రోజులలో మంచి పర్యాటక కేంద్రంతోపాటు భక్తి పారవశ్యంతో పరవశించిపోతుందని చెప్పారు. చల్మెడ ఆనందరావు మాట్లాడుతూ పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతోనే గుడి, బడి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ముందుకు పోతున్నామన్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు బడి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి చినజీయర్ స్వామి రావడం సంతోషకరమన్నారు. జూన్ కల్లా గుడి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఊరికి సేవ చేయడం చాలా సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రమేశ్బాబు మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ ఒడ్డున కోదండ రామస్వామి ఆలయం నిర్మించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి ఆనాడు తమ తండ్రి రాజేశ్వరావు, అలాగే చల్మెడ ఆనందరావు కన్న కలలు నేరవేరుతున్నాయన్నారు. మల్కపేట మంచి పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. ఇక్కడ రాష్ట్ర పశుగాణాబివృద్ధి సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు, చల్మెడ హాస్పిటల్ చైర్మన్ చలిమెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, వికాస తరంగణి నాయకులు గౌతంరావు, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచ్ ఆరె లత, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.