12 ఏరియాల్లో 50.55 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
నర్సరీల్లో 75 రకాల పూలు, పండ్ల మొక్కలు సిద్ధం
అంతరిస్తున్న వృక్ష జాతులకు ప్రాధాన్యం
ఇప్పటికే ఆరు విడుతల్లో 4.59 కోట్లు నాటిన సంస్థ
శ్రీరాంపూర్, జూలై 13 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహరం కార్యక్రమాన్ని సింగరేణిలో ఆ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తున్నది. యేటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. ఇప్పటికే ఆరు విడుతల్లో 4.59 కోట్ల మొక్కలు నాటగా, ఏడో విడుతలో 50.55 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమైంది.
సింగరేణి సంస్థ 1984 నుంచి స్వయంగా చేట్టిన ప్లాంటేషన్ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 12,976 హెక్టార్లలో మొక్కలు నాటింది. ఓపెన్ కాస్ట్ గనుల డంప్యార్డుల (మట్టిగుట్టలు) మీద, విశాలమైన ఖాళీ ప్రదేశాలు, రోడ్లు, కాలనీలు, కార్యాలయాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఓబీ ప్లాంటేషన్ కింద ఇప్పటికే 4,898 హెక్టార్లలో 2.27 కోట్లకు పైగా మొక్కలు నాటగా, ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి అడవులను తలపిస్తున్నాయి. సత్తుపల్లి ఓసీ, జీకే ఓసీ(కొత్తగూడెం), మణుగూరు ఓసీ, శ్రీరాంపూర్ ఓసీ డంపుల మీద పెంచిన ప్లాంటేషన్లలో అంతరించిపోతున్న వృక్ష జాతులు తిరిగి ప్రాణం పోసుకొని సహజ అడవులను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో జన సంచారం నిషేధం కనుక పెంచిన అడవుల్లో పక్షులు, జంతుజాలం వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర అటవీశాఖ వారు సైతం కొత్త అధికారులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి మొక్కల పెంపుదలలో సింగరేణి తీసుకొన్న చర్యలను వివరిస్తున్నారు. కాగా 6,738 హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్లో 1.14 కోట్లకుపైగా మొక్కలు నాటగా, నేడు అవి దట్టంగా పెరిగి అడవులను తలపిస్తున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో పెంచిన వెదురు బ్లాక్ ప్లాంటేషన్ను, ఇతర బ్లాక్ ప్లాంటేషన్లను రాష్ట్ర కేంద్ర అటవీ శాఖల ఉన్నతాధికారులు పలుమార్లు సందర్శించి ప్రశంసించారు. బ్లాక్ ప్లాంటేషన్లలో ఒకే రకమైన మొక్కలు కాకుండా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో కూడా ప్రధానంగా అంతరించి పోతున్న వృక్ష జాతుల మొక్కలనే పెంచడం గమనార్హం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కల పెంపకానికి, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఆయన గతంలో సెంట్రల్ నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. అలాగే నాటిన మొక్కల సంరక్షణకు, మొక్కల పెంపకానికి తగినన్ని నిధులు మంజూరు చేశారు. హరితహారంలోనూ ఆయన పాలుపంచుకుని అందరిలో స్ఫూర్తి నింపారు. సీఎండీ మార్గనిర్దేశంలో సంస్థ డైరెక్టర్లు, జీఎంలు, అధికారులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని ఏరియాల్లో హరితహారంలో చురుగ్గా పాలుపంచుకుని విజయవంతం చేస్తున్నారు. సింగరేణి డైరెక్టర్(పా) బలరాం ఒక్కరే 12 వేల మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం.
మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
కేవలం బొగ్గు తవ్వకాలకేగాకుండా పర్యావరణ పరిరక్షణకూ సింగరేణి పెద్దపేట వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత పచ్చదనానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ యేటా ప్రత్యేక ప్రణాళికతో హరితహారాన్ని విజయవంతం చేస్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం సమీప గ్రామాల ప్రజలకు కాంట్రాక్టు పద్ధతిలో బాధ్యతలు సంస్థ అప్పగించింది. దీంతో నాటిన మొక్కల్లో 90 శాతం చక్కగా పెరుగుతుండడం విశేషం. ఓవర్ బర్డెన్ డంప్(మట్టిగుట్టల)పై నాటిన మొక్కలు అడవులను తలపిస్తున్నాయి.
అంతరిస్తున్న వృక్ష జాతులకు ప్రాధాన్యం
సింగరేణి చేపడుతున్న హరితహారంలో అంతరించిపోతున్న వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇస్తున్నది. 75 రకాల మొక్కలు నాటుతూ వాటిని పెంచేందుకు కృషి చేస్తున్నది. ముఖ్యంగా ఉసిరి, నారేప, జిట్రేగి, బండారు, బట్టఘనము, మారేడ్, నేరేడు, తాని, నెమళినార, జువ్వి, రావి, తెల్ల చిందుగ, మేడి, బూరుగ, ఎర్ర చందనము, టేకువంటి చెట్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నది. సింగరేణి వ్యాప్తంగా 12 నర్సరీల్లో దాదాపు 50.55 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవేగాకుండా సమీప గ్రామాల ప్రజల్లోనూ పర్యావరణ స్ఫూర్తిని నింపడానికి సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా పూలు, పండ్ల మొక్కలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నది.