కెరీర్ ఆరంభంలో కుర్రకారు కలల రాణిగా భాసిల్లింది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాల్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. శనివారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించిన అనుపమ పరమేశ్వరన్ తన విఫలప్రేమ గురించి బయటపెట్టింది. ఓ వ్యక్తిని ప్రాణప్రదంగా ప్రేమించానని..కానీ ఆ బంధాన్ని సఫలం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అనుకోని కారణాల వల్ల అతనితో బ్రేకప్ చేసుకున్నానని చెప్పింది. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటుందనుకునే ఈ అమ్మడు ఒక్కసారిగా తన లవ్ఫెయిల్యూర్ గురించి చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. లాక్డౌన్ విరామంలో చిత్రలేఖనం నేర్చుకున్నానని, మానసిక ప్రశాంతత కోసం పెయింటింగ్స్ వేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘18పేజెస్’ ‘కార్తికేయ-2’ ‘రౌడీ బాయ్స్’ చిత్రాల్లో నటిస్తోంది.