సుప్రీంకోర్టు హితవు
న్యూఢిల్లీ, జూలై 8: అభిప్రాయాలను ప్రభావితం చేసే సామర్థ్యంతో ఫేస్బుక్ వంటి డిజిటల్ వేదికలు అధికార కేంద్రాలుగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మాధ్యమాలు జవాబుదారీగా ఉండాలని హితవు పలికింది. యూజర్ల పోస్టులకు ఫేస్బుక్ వేదిక మాత్రమేనని, అంతకుమించి తన పాత్ర ఏమీ ఉండదనే ఆ సంస్థ సమస్యాత్మక ధోరణిని ఆమోదించలేమని స్పష్టం చేసింది. గత ఏడాది ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి సాక్షిగా హాజరుకావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి-సామరస్యత కమిటీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.