అమృతం కోసం దేవ-దానవులు క్షీరసాగరాన్ని మథించారు. నీలి సంద్రంలో దాగున్న అమూల్యమైన నిధి-నిక్షేపాలు, పెట్రోలియం వంటి సంపదను కనిపెట్టడానికి పలు దేశాలు, వ్యాపార సంస్థలు అత్యాధునిక మిషన్లను నిర్వహిస్తున్నాయి. అయితే నవీన సంస్కృతికి జీవనాడులను అద్దిన గత చరిత్రను, సంస్కృతీ వైభవాన్ని, పలు దేశాల రహస్యాలను నిక్షిప్తం చేసుకొని.. ఏదో ఓ పెద్ద ప్రమాదం జరిగి మునిగిపోయి.. కడలి గర్భంలో వందల ఏండ్లుగా మౌనంగా కునారిల్లుతున్న ఓడల రహస్యాలను తెలుసుకునే ప్రక్రియ మాత్రం అనుకున్నంత వేగంగా జరుగడంలేదు. దీన్ని భర్తీ చేసేందుకే రంగంలోకి దిగుతున్నాయి ‘డీప్ సీ రోబోలు’. టైటానిక్ ఓడను కనిపెట్టిన సముద్ర పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బలార్డ్ ఈ సాంకేతికత అవసరాన్ని ఇటీవల ప్రత్యేకంగా వివరించారు.
ఏమిటీ ‘డీప్ సీ రోబోలు’
సముద్ర అడుగుభాగంలోని రహస్యాలను ఛేదించే అత్యాధునిక మిషన్ను ‘డీప్ సీ రోబో’ అని పిలుస్తారు. ఒక్కసారి ప్రీ-ప్రోగ్రామింగ్ చేస్తే చాలు.. ఎలాంటి ఆదేశాలు అవసరంలేకుండానే ఈ రోబోలు మిషన్ను పూర్తి చేస్తాయి. ఇందుకోసం మిషన్ లక్ష్యం, రూట్, డేటా ప్రాసెసింగ్ వంటి ఆదేశాలను రోబోకు ముందుగానే ఇవ్వాలి.
ఎలా కనిపెడుతుంది?
అపరేటర్ అవసరంలేకుండా నిర్దేశిత లక్ష్యాల్ని పూర్తి చేస్తుండటం ‘డీప్ సీ రోబో’ ప్రత్యేకత. కమాండ్ కంట్రోల్తో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో వీటిని శత్రు దేశాలు, రాడార్లు పసిగట్టలేవు. అందుకే రక్షణ అవసరాలకు పలు దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి. ఇక, సముద్రంలో మునిగిపోయిన ఓడల జాడను కనిపెట్టడంలో భాగంగా సముద్ర జలాల్లోని కొన్ని కిలోమీటర్ల పరిధిని ఒక్కో రోబోకు కేటాయిస్తారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాల్లో అంతరాయం ఉండకపోవడం, కచ్చితమైన ప్రీ-ప్రోగ్రామింగ్ వల్ల గంటల వ్యవధిలో ఆ రోబో ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడపడుతుంది. సముద్రం అడుగున ఏ ప్రాంతంలో ఓడ ఉన్నది? ఎంత లోతులో ఉన్నది? ఎంత మోతాదులో శిథిలమైంది? తదితర అంశాలను శోధిస్తుంది. రోబోలో ఉన్న ప్రత్యేకమైన సెన్సర్లు దీనికి సాయపడుతాయి.
ఇప్పుడే ఎందుకు?
యునెస్కో అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వివిధ సముద్రాల్లో 30 లక్షలకు పైగా మునిగిపోయిన ఓడలు ఉన్నాయి. అయితే, ఏండ్లు గడుస్తున్న కొద్దీ ఆ నౌకలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే.. ఓడ మునిగిపోవడానికి కారణాలు, రహస్య సమాచారం తదితర విషయాలు తెలుసుకోవడం మరింత కష్టమవుతుంది. ఈ ఓడల జాడను కనిపెట్టడానికి ఇప్పటికే సంప్రదాయ పద్ధతుల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, ఇంత భారీ సంఖ్యలోని ఓడల సమాచారాన్ని అన్వేషించాలంటే ఎక్కువ సమయం పడుతున్నది. దీంతో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ‘డీప్ సీ రోబో’ను ప్రతిపాదించారు.
టైటానిక్ను గంటలో కనిపెట్టేసేవాళ్లం!
అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన రెండు జలాంతర్గాముల జాడను కనిపెట్టాలని రాబర్ట్ బలార్డ్కు 1985లో అమెరికా నేవీ రహస్య మిషన్ను అప్పగించింది. అయితే, వీటిని వెతికే సమయంలో 1912లో అదే ప్రాంతంలో మునిగిపోయిన టైటానిక్ జాడ తెలిస్తే దాని వివరాలను బయటి ప్రపంచానికి చెప్తానని బలార్డ్ అధికారులకు చెప్పారు. ఊహించినట్టుగానే టైటానిక్ను బలార్డ్ గుర్తించాడు. అయితే, టైటానిక్ అన్వేషణకు ఏండ్ల సమయం పట్టిందని, ఇప్పటి ‘డీప్ సీ రోబో’ సాంకేతికత అప్పుడు అందుబాటులో ఉంటే గంట వ్యవధిలో ఆ ఓడను గుర్తించేవాడినన్నారు.
వీటి రహస్యం బయటపడొచ్చు!