పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో చిరాగ్ ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 20: తన కుటుంబంలోని వ్యక్తులే తనకు వెన్నుపోటు పొడిచారని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యనిర్వాహక సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సుమారు 90 శాతం మంది కార్యనిర్వాహకులు హాజరయ్యారని, తమదే అసలైన ఎల్జేపీ అని చెప్పారు. తన బాబాయ్, ఎల్జేపీ పార్లమెంటరీ పక్ష నేత పశుపతి కుమార్ పరాస్ వర్గం తమదే అసలైన ఎల్జేపీ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో చిరాగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. జులై 5 నుంచి బీహార్లో ‘ఆశీర్వాద్ యాత్ర’ను చేపట్టనున్నట్టు చిరాగ్ ప్రకటించారు. తన తండ్రి, దివంగత నాయకుడు రామ్విలాస్ పాశ్వాన్ జయంతి అయిన జూలై 5న.. బీహార్లోని హజీపూర్ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. కాగా, ఢిల్లీలో చిరాగ్ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యనిర్వాహక వర్గం అసలైంది కాదని, అందులో పాల్గొన్నవారిలో సగం మంది ‘కిరాయిదారులు’ అని పశుపతి కుమార్ ఎద్దేవా చేశారు. ఎల్జేపీ అధ్యక్షుడిని నిర్ణయించేది ఎన్నికల కమిషన్ అని తేల్చి చెప్పారు. చిరాగ్ అక్రమంగా అధ్యక్ష పదవి చేపట్టారని, అది చెల్లదని పరాస్ ఆరోపించారు.