యాదాద్రి, జూన్ 20 : ఇలా వైకుంఠపురంగా యాదాద్రి పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అనతికాలంలోనే స్వ యంభు వెలసిన నారసింహుడి నూతన క్షేత్రం త్వరలో ప్రారంభం కానున్నది. దాదాపుగా పనులు పూర్తి చేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటుంది. యాదాద్రి ప్రధానాలయం పూర్తికాగా, భక్తుల వసతులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ పర్యటన ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి వచ్చి పనులను పరిశీలించే అవకాశం ఉన్నది. ఇందులో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో జరిగిన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకునే వీలుంది. ఆదివారం యాదాద్రి ప్రాంతాన్ని పోలీసు సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవోలు భూపాల్రెడ్డి, సూరజ్కుమార్ ఆలయ పనులను పరిశీలించారు.
14 మార్లు పర్యటన..
ఆలయ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రిలో 14 మార్లు పర్యటించి పనులను పర్యవేక్షించారు. చివరిసారిగా 2021 మార్చి5వ తేదీన సందర్శించిన సందర్భంగా చేసిన సూచనలతో పనులు వేగం పుంజుకున్నాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను సైతం లెక్కచేయకుండా వైటీడీఏ అధికారులు పనులు కొనసాగించారు. శ్రీవారి గర్భాలయాన్ని చూడముచ్చటగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు గర్భాలయం ముందు భాగంలో నగిషీ పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ సూచనల మేరకు గర్భాలయం ముందు క్యూలైన్ల ఏర్పా టు చేశారు. యాదాద్రిలో శ్రీనారసింహుడు కొలువు తీరడానికి తన భక్తితో మెప్పించిన ప్రహ్లాదుని చరిత్రను తెలిపే ఇత్తడి ఫలకాలను అమర్చారు. ఉపపీఠం, అధిష్టానం, స్తంభవర్ణం, ప్రత్సరం వరకు పనులు పూర్తయ్యాయి. ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా గల రెయిలింగ్ పనులు, ఆలయం వద్ద క్లాడింగ్ పనులు పూర్తయ్యాయి. పశ్చిమ గోపురం నుంచి భక్తులు బయటకు వెళ్లేందుకు సపోర్టుగా ఉండేందుకు ఉద్దేశించిన రెయిలింగ్ పనులు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి.
ఈశాన్య భాగంలో ఉన్న మూడంతస్తుల రాజగోపురం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించే ప్రాంతంలో వీవీఐపీలు కూర్చోవడానికి వీలుగా రాతితో బెంచీని ఏర్పాటు చేశారు. బెంచీని మోస్తున్నట్టుగా రెండు ఏనుగుల ప్రతిమలను అమర్చారు. సీఎం ఆదేశం మేరకు.. భక్తులు ప్రవేశించే ప్రవేశద్వారానికి ఇరువైపులా ఐరావతాలు స్వాగతం చెప్తున్నట్టు శిల్పాలను చెక్కారు. బలిపీఠం, ధ్వజస్తంభాలను స్వర్ణమయం చేసే పనులు పూర్తికావొచ్చాయి. గర్భలయానికి గల గోడల పై భాగంలో శంఖం, చక్రం, నామశాస్త ప్రకారం పూర్తయింది. విమానగోపురం వెలుపల ప్రథమ ప్రాకారంలో పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయి. లోపలి ప్రాకారంలో అద్దాలు మండపం పనులు పూర్తికావొచ్చాయి. స్వయంభూవులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కనువిందు చేసే విధంగా బంగారు వర్ణపు ఆధునాతన క్యూలెన్ల అమరిక దాదాపుగా పూర్తయ్యింది. రెండు వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా రూ. 1,000 కోట్ల వరకు వెచ్చించి విస్తరణ, శిల్పి పనులు దాదాపుగా పూర్తి చేశారు. పనుల్లో పురోగతిని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించేందుకు వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్వయంభువులు కొలువైన ప్రధానాలయం నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అష్టభుజి నిర్మాణాలు పూర్తిగకాగా 28 విమానాలలను అష్టభుజి మండపాలపై నిర్మించారు. సప్త గోపురాలు అందంగా ముస్తాబు చేశారు. 100 శాతం పనులు పూర్తయ్యాయి.
కొండకింద సర్వహంగుల ఆధ్యాత్మిక రాజధాని
యాదాద్రి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సర్వహంగులతో ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రూ. 33.69 కోట్లతో యాదాద్రి కొండపైన గల గండి చెరువు సుందరీకరణతో పాటు రూ.11.55 కోట్లతో 2.47 ఎకరాలలో ఒకేసారి 1500 మంది భక్తులు పుణ్యస్నానమాచరించే విధంగా అధునాతన పుష్కరిణీ నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.8.35 కోట్లతో అధునాతన నిత్యాన్నదానం సత్రం 2.55 ఎకరాలలో జీ ప్లస్ వన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 8.39 ఎకరాలలో ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మాణానానికి కావాల్సిన పనులను జరుగుతున్నాయి. సుమారు 4 వేల మంది భక్తులు ఉండేలా రోజుకు 35 వేల మంది భక్తుల తాడికి తట్టుకునే విధంగా నిర్మాణాలు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆలయ చుట్టూ నిర్మిస్తున్న ఆరులేన్ల రోడ్లు పనులు పూర్తి కావొచ్చాయి. ఆలయ వైకుంఠ ద్వా రం వద్ద సర్కిల్ నిర్మాణం, రోడ్డు యాదగిరిపల్లి నుంచి వైకుంఠద్వారం రోడ్డు విస్తరణ, వైకుంఠ ద్వారం నుంచి తిరిగి ఘాట్రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులను జరుగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాల్లో వీఐపీ సూట్స్ పనులు సైతం 95 శాతం పూర్తయ్యాయి.
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ వారు రూపొందించిన ప్రత్యేకంగా డిజైన్ చేసిన విద్యుత్ దీపాలను అలంకరించారు. ప్రధానాలయంలో ప్రథమ, ద్వితీయ ప్రాకారాలు, యాలీ ఫిల్లర్లకు లైటింగ్ను బిగించారు. ప్రపంచంలో ఏ ఆలయానికి వాడని విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైటింగ్ యాదాద్రి ఆలయానికి వినియోగించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ ముడిసరుకు అమెరికా నుంచి తీసుకువచ్చారు. గత వారం ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి విద్యుత్ దీపాల ట్రయల్ రన్ నిర్వహించి సఫలమయ్యారు. ట్రయల్ రన్లో యాదాద్రి పసిడి వర్ణపు కాంతులతో రాత్రి ధగధగ లాడింది. అధునాతన విద్యుత్ దీపాలంకరణను సీఎం కేసీఆర్ చూసే అవకాశం ఉన్నది.