బీజేపీ.. జాతిని ముక్కలు చేసే దౌర్భాగ్యపు పార్టీ. జాతి, మతం, కులాల పేరిట సంస్కృతిపై, ఆహార అలవాట్లపై దాడి చేస్తున్నది. బెంగాల్లో మమతాబెనర్జీని ఓడించేందుకు బీజేపీ నాయకులు తోడేళ్లలా దాడి చేసినా అక్కడి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. అదే తరహాలోనే ఇప్పుడు తెలంగాణపై దాడికి ప్రయత్నిస్తున్నది. ఇక్కడ కూడా మనం తిప్పికొట్టాలి.
–మాజీ మంత్రి కడియం శ్రీహరి
వరంగల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమ్యూనిస్టు, సోషలిస్టునని చెప్పుకొని.. వేల కోట్లు, వందల ఎకరాల భూములను సంపాదించి గడీలను మించిన భవనాల్లో ఉంటున్న ఈటల రాజేందర్ ఫ్యూడల్ వ్యవస్థకు అసలైన ప్రతినిధి అని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభివర్ణించారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ అధికారం, పదవులు, అక్రమాస్తులు కాపాడుకొనేందుకే ఈటల బీజేపీలో చేరాడని విమర్శించారు. చట్టవిరుద్ధంగా పేదల భూములు కొన్నందుకే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాడని చెప్పారు. ఇన్నేండ్లు సీఎం కేసీఆర్ ఇచ్చిన పదవులన్నీ అనుభవించిన ఈటల.. బీజేపీలో చేరిన తర్వాత అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. పేదల అసైన్డు భూములు కొన్నానని చెప్పిన ఈటల, కమ్యూనిస్టు ఆలోచనతో ఉన్నట్లేనా? ఆత్మగౌరవం, అభిమానం గురించి మాట్లాడే ఆయన వెంటనే భూములను ఎందుకు సరెండర్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్తో ఐదేండ్ల క్రితమే విభేదించానని చెప్తున్న ఈటల..ఆత్మగౌరవం ఉంటే అప్పుడే పదవులకు రాజీనామా చేసి వైదొలగాలి కదా అని నిలదీశారు. సంక్షేమపథకాలపై విమర్శలు చేసిన ఈటలకు పేదలపై ఉన్న నిబద్ధతత ఏపాటిదో అర్థమవుతున్నదని ఎద్దేవాచేశారు. రైతుబంధుపై అంతగా మాట్లాడే ఈటల.. ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ.26 లక్షలను ఎందుకు వెనక్కి ఇవ్వలేదని ప్రశ్నించారు.
అధికారం లేకుండా ఉండలేని ఈటల..రాజకీయ మనుగడ కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈటల బీజేపీలో చేరాడని ఆరోపించారు. ‘బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. జాతిని ముక్కలు చేసే దౌర్భాగ్యపు పార్టీ. జాతి, మతం, కులాల పేరిట సంస్కృతిపై, ఆహార అలవాట్లపై దాడి చేస్తున్నది’ అని విమర్శించారు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీని ఓడించేందుకు బీజేపీ నాయకులు తోడేళ్లలా దాడిచేసినా అక్కడి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. అదే తరహాలోనే ఇప్పుడు తెలంగాణపై దాడికి ప్రయత్నిస్తున్నదన్నారు. టీఆర్ఎస్లోని కొందరిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నదని, తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి తెలంగాణలో ముక్కు, మూతి పగలడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కనుమరుగవుతున్న పార్టీ అని, ఆ పార్టీలో ఎమ్మెల్యే కాలేనివారు కూడా సీఎం అవుదామనుకుంటారని ఎద్దేవాచేశారు. తెలంగాణకు ఏకైక బాహుబలి కేసీఆర్ ఒక్కరేనని, మరో 20 ఏండ్లు ఆయన వెంటే తెలంగాణ ప్రజలు ఉంటారని పేర్కొన్నారు.
సిద్ధాంతాలను వదిలేసి బీజేపీలో చేరిన ఈటలను చూస్తే జాలేస్తున్నదని కడియం అన్నారు. బీజేపీలో చేరితే కనీసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా కండువా కప్పలేనప్పుడు ఆత్మగౌరవం ఎక్కడుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకే బీజేపీలో చేరినట్టు చెప్పాడే కానీ.. బీజేపీ పాలన నచ్చి చేరినట్టు ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేంద్రంలోని బీజేపీ ఏంచేసిందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనచట్టంలో పెట్టిన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే పట్టించుకోని విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి వేస్తున్న బీజేపీలో ప్రజాస్వామ్యం ఎంత పాళ్లలో ఉందో ఈటల రాజేందర్ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.