హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ/ చింతలపాలెం: నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్న నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మేడ్చల్ జిల్లా నూతనకల్లులో గోదాములపై హైదరాబాద్ నార్త్జోన్ పోలీసులు, మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులు దాడులుచేసి రూ.5.2 కోట్ల విలువైన వరి, మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫార్చూన్ అగ్రి సీడ్స్ పేరుతో రవీందర్ వరి విత్తనాలు, ఎస్ఎం పాకాల అగ్రిటెక్ పేరుతో శ్రీనివాస్రావు మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్నారు. అధికారులు ఇద్దరి గోదాముల్లో తనిఖీచేసి రూ.4.95 కోట్ల విలువైన వరి విత్తనాలు, రూ. 24,09,400 విలువైన మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాహుల్హెగ్డే వెల్లడించారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడుకు చెందిన ముద్దెన వెంకటేశ్వర్లు, లక్ష్మి దంపతులు.. రుద్రంగి మండలం మానాలకు చెందిన ముద్దాల భూమయ్య, చందుర్తి మండలం నర్సింగాపూర్కు చెందిన బొడ్డు వినోద, శ్రీకాంత్, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందరామ్కు చెందిన భూపతి మహేశ్తో ఒప్పందం కుదుర్చుకొని ఏపీ నుంచి అనుమతి లేని నకిలీ విత్తనాలను దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు చేసి సుమారు రూ.12.14లక్షల విలువైన 6.7 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర్లు, లక్ష్మి పరారీలో ఉండగా మిగతా నలుగురిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కేంద్రంగా నకిలీ మిరప విత్తనాలు విక్రయిస్తున్న మోర్తాల నాగిరెడ్డి, మల్రెడ్డి సైదిరెడ్డిని పోలీసులు అరెస్టుచేసి రూ.7.25 లక్షల విలువైన 290 విత్తన ప్యాకెట్లు, బైక్, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.