దుండిగల్/జీడిమెట్ల, జూన్ 11: సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కరోనా ముప్పు నుంచి కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి, సూరారం కాలనీ రాజీవ్ గృహకల్పలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సుమారు 900మంది ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ ఓ డాక్టర్ మల్లికార్జున్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారు, మండల వైద్యాధికారి నిర్మల, మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గం పరిధిలో సూపర్స్ప్రెడర్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్కు విశేషస్పందన లభిస్తున్నది. నియోజకవర్గం పరిధిలో గురువారం వరకు 31,437 మందికి వ్యాక్సిన్లు వేయగా శుక్రవారం మరో 4088 మందికి టీకాలు వేశారు.దీంతో మొత్తంగా నియోజకవర్గం పరిధిలో 35,525 మంది టీకాలను తీసుకున్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల సరోజినీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో 1374మంది టీకాలు వేయించుకోగా గాజులరామారంలోని మహారాజా గార్డెన్లోని వ్యాక్సినేషన్ కేంద్రంలో 1201మంది సూపర్స్ప్రెడర్లు టీకాలను తీసుకున్నారు.అదే విధంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ ఫంక్షన్హాల్లో 885 మందికి,కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి,కొంపల్లి టీకా కేంద్రాల్లో మరో 628 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ ఫంక్షన్హాల్లో సూపర్స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సందర్శించారు.ఆయనతో పాటు దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ పీ.భోగీశ్వర్లు ఉన్నారు.