పేదలకు డయాగ్నొస్టిక్ సేవలు
ఉచితంగా 57రకాల వైద్య పరీక్షలు
ఈసీజీ, అల్ట్రాసౌండ్,సీటీస్కాన్ వంటి అత్యాధునిక సదుపాయాలు
ప్రైవేట్ సెంటర్ల దందాకు గండి
మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాలకు అవకాశం
ప్రారంభానికి సిద్ధమైన కేంద్రాలు
మహబూబ్నగర్ జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల: ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొన్న స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలకు అద్భుతమైన కానుక అందించారు. పైసా ఖర్చు లేకుండా 57రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాలకు అవకాశం లభించింది. దక్కాయి. పేదల ఆరోగ్యానికి ఇప్పటికే బస్తీ దవాఖానలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫ్రీగా డయాగ్నొస్టిక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇకపై ఈ సెంటర్లలో రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, రేడియాలజీ వంటి అత్యాధునిక పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు.
ఉచితంగా 57 రకాల పరీక్షలు
రోగనిర్ధారణ కోసం కార్పొరేట్ దవాఖానల్లో చేసే పరీక్షలను డయాగ్నొస్టిక్ హబ్లో ఉచితంగా చేయనున్నారు. రోగులకు డయాగ్నొస్టిక్ హబ్లో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేస్తారు. రూ.2.5కోట్లతో హబ్ ఏర్పాటు చేశారు. ఇందులో బయోకెమిస్ట్ విభాగంలో 35రకాల పరీక్షలు చేస్తారు. మధుమేహం (డయాబెటిక్) నిర్ధారణ కోసం ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్, ఆర్బీఎస్, తదితర పరీక్షలు చేస్తారు. థైరాయిడ్ ప్రొఫైల్లో టీ 3 టోటల్, టీ 4 టోటల్, టీసీహెచ్ పరీక్షలు చేయనున్నారు. లివర్ ఇన్ఫెక్షన్ టెస్ట్లో పది రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. రీనల్ ఫంక్షన్ టెస్టులో (రెండు రకాలు), లిఫిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఏడు రకాల పరీక్షలు చేస్తారు. సీరం ఎల్రక్టోలైట్స్ పరీక్షల్లో సీరం సోడియం, సీరం పొటాషియం, సీరం క్లోరైడ్తో సహా మరో నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
పాథాలజీ విభాగంలో కంప్లీట్ బ్లడ్ పిక్ఛర్(సీబీపీ)లో 14 రకాల రక్త పరీక్షలు చేస్తారు. మైక్రో బయాలజీలో చికెన్గున్యా, డెంగీతోపాటు మరో ఆరు రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఆటోమేటిక్ కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యునోఅస్సెనలైజర్, హెమటాలజీ అనలైజర్, ఎలక్ట్రోలైట్ అనలైజర్, ఆటోమేటిక్యూరిన్ అనలైజర్ తదితర యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, మేనేజర్, 10మంది ల్యాబ్అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేశారు. రోగి తన రక్తనమూనా, వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్ ఇవ్వగానే పరీక్షలు చేసి రిపోర్టులను రోగి మొబైల్కు పంపుతారు. పీహెచ్సీల నుంచి రక్త నమూనాలను సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు చెల్లుచీటీ
కరోనా వ్యాప్తి చెందుతున్నందున ర్యాపిడ్, ఆర్టిపీసీఆర్ టెస్టుల్లో కొవిడ్ సోకినట్లు దాఖలాలు లేకపోవడంతో రోగులు గత్యంతరం లేక సీటీస్కాన్ కోసం ప్రైవేట్ డయా గ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇదే అదనుగా దందాకు తెరలేపిన ప్రైవేట్ డయా గ్నొస్టిక్ సెంటర్లు టెస్టుల కోసం వచ్చిన వారి నుంచి రూ. 4నుంచి 6వేల వరకూ వసూలు చేసేవారు. చివరకు ప్రభుత్వమే కల్పించుకుని సీటీస్కాన్ ధరలను క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల వల్ల పేద రోగులు ఎవరూ ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.
అత్యాధునిక పరికరాలు
రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నొస్టిక్ ల్యాబ్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. థైరాయిడ్ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన మిషన్లో ఒకేసారి 60 శాంపిల్స్ పరీక్షలు చేయనున్నారు. అలాగే సీబీపీ(కంప్లీట్బ్లెడ్పిక్చర్) రక్తకణాల గుర్తింపు మిషన్లో ఒకేసారి 120 శాంపిల్స్ పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. బయోకెమిస్ట్రీ పరికరంలో ఒకేసారి 400 శాంపిల్స్ పరీక్ష చేయడానికి అవకాశం ఉంది. ల్యాబ్లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది పని చేస్తున్నారు. డిజిటల్ ఎక్స్రే అందుబాటులోకి తెవడంతో 57 పరీక్షలు ఇక్కడే చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు కేంద్రాలు
పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి ఉండకూడదని.. వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు సెంటర్లు పని చేయనున్నాయి.