సుల్తాన్బజార్, మే 20 : లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఎంజీబీఎస్లో ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించారు.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చిన బస్సులు.. ఇక్కడ ఆల్టింగ్ చేసిన అంతరం డ్రైవర్లు, కండక్టర్లు ఉదయం 10 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు.. 20 గంటలు ఇక్కడే ఉండే విధంగా రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో సీబీఎస్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇందులో సుమారు 580 పడకలు అందుబాటులో ఉన్నాయని..ప్రస్తుతం 280 మంది డ్రైవర్లు, కండక్టర్లకు వసతిని కల్పించామని..ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కాచిగూడ డిపోలో కూడా ఏర్పాట్లు చేశామని ఎంజీబీఎస్, జేబీఎస్ కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ సరిరాం, అసిస్టెంట్ మేనేజర్ సుధ తెలిపారు. నిత్యం 166 బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి.. సుమారు 6,500 మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారని తెలిపారు. కాగా.. ఎంజీబీఎస్ నుంచి బయలు దేరిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఆయా డిపోల వద్ద ఉన్న వసతి గృహాల్లో ఉంటారని తెలిపారు.
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం విధి నిర్వహణలో ఉంటున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందులు లేకుండా విశ్రాంత గదుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉదయం ఆరు గంటలకే బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకున్నాం.- వరప్రసాద్, ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్
ఎంజీబీఎస్కు నిత్యం అన్ని జిల్లాల డిపోల నుంచి 140 బస్సుల వరకు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న 280 మంది డ్రైవర్లు, కండక్టర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎక్కువ మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వచ్చినా..ఎలాంటి ఇబ్బంది లేకుండా కాచిగూడ డిపోలో కూడా ఏర్పాట్లు చేశాం.-సుధ, ఎంజీబీఎస్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్
ఎంజీబీఎస్లో డ్రైవర్లు, కండక్టర్ల కోసం చేపట్టిన ఏర్పాట్లు బాగున్నాయి.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.. దూర ప్రాంతాల నుంచి వచ్చే మాకు ఉదయం 10 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది. -శంకర్, డ్రైవర్, మహబూబ్నగర్