సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి జంక్షన్, మే18: కరోనా కట్టడికి పట్టణంలో పారిశుధ్య పనులు నిత్యం చేయించాలని, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆదేశించారు. పట్టణంలో కరోనా కట్టడి, పారిశుధ్య చర్యలు, మిషన్ భగీరథ పనుల ప్రగతిపై మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, సంబంధిత అధికారులతో మంగళవారం తన నివాసం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 36 వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించాలని ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, లాక్డౌన్ సడలింపు సమయంలో నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని కొనుగోళ్లకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టణంలో మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆందోళన వద్దు..
కరోనా బారిన పడిన వారు భయపడవద్దని అవసరం మేరకు ప్రభుత్వ దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందనని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్రెడ్డి, పులిపాక రాజు పాల్గొన్నారు.
పెద్దపల్లిటౌన్, మే 18: కరోనా కట్టడికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. పట్టణంలోని సాగర్రోడ్, శాంతినగర్, జెండాచౌరస్తా తదితర వార్డుల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేయించామని వివరించారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇక్కడ కౌన్సిలర్ నాంసాని సరేశ్బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
లాక్డౌన్ పరిశీలన
అలాగే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా లాక్ డౌన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ సీఐలు ప్రదీప్కుమార్, అనిల్కుమార్, ఎస్ఐలు రాజేశ్, ఇసాక్హైమద్ తదితరులు పాల్గొన్నారు.