న్యూఢిల్లీ : రాష్ట్రాలు కోరుతున్న వ్యాక్సిన్ డోసుల్లో కోత పెట్టి విదేశాలకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అమ్ముకుంటోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మన దేశంలో ప్రజలు కరోనా మహమ్మారితో కన్నుమూస్తుంటే విదేశాలకు 6.5 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేయాల్సి వచ్చిందని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీకి 1.34 కోట్ల వ్యాక్సిన్ డోసులను తాము కోరితే తాము కేవలం 5.5 లక్షల వ్యాక్సిన్ డోసులే కోరామని బీజేపీ అవాస్తవాలు చెబుతోందని అన్నారు.
మరోవైపు తమ వద్ద వ్యాక్సిన్ నిల్వలు మరో మూడు, నాలుగు రోజులకే సరిపోతాయని తక్షణమే కేంద్రం ఢిల్లీకి వ్యాక్సిన్ సరఫరాలు పెంచాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. థర్డ్ వేవ్ తలెత్తినా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో పడకల సామర్ధ్యం పెంచేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని చెప్పారు. తదుపరి వేవ్ లో రోజూ 30,000 కేసులు నమోదైనా ఎదుర్కొనేలా ప్రభుత్వం అప్రమత్తమవుతోందని తెలిపారు.