ఊరూవాడా సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణ
మాస్కులు పెట్టుకోని వారికి జరిమానా
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం
పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జన సంచారంతోపాటు పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని ఆదేశించడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆ దిశగా
కార్యాచరణ ముమ్మరంగా సాగుతున్నది. ఎప్పటికప్పుడు వీధుల్లో చెత్త తరలించడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ శానిటైజ్ చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. దుకాణాలు, మార్కెట్లలో జనసమూహం లేకుండా చూస్తున్నారు. మాస్కులు లేనివారికి జరిమానా సైతం విధిస్తున్నారు.
నల్లగొండ, మే 9: కరోనా తొలి వేవ్లో పట్టణాల్లోనే ఉధృతంగా ఉన్నప్పటికీ సెకండ్ వేవ్ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో విలయ తాండవం చేస్తున్నది. దీంతో పంచాయతీలతో పాటు పట్టణాల్లోనూ సైతం వైరస్ను అరికట్టేందుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ శాఖ, మున్సిపల్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటూ వైరస్ నిర్మూలనకు సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేసే పనుల్లో నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాల్లో ఆయా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేసే పనులు ప్రారంభమయ్యాయి. వైరస్ తీవ్రత, జన సంచారం బట్టి అవసరమైతే వారానికి కనీసం రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. మొదటి వేవ్లో 75 వేల లీటర్ల హైపోక్లోరైట్ కొనుగోలు చేసి పంచాయతీ శాఖ అధికారులకు ఇచ్చింది. కానీ ఈ సారి ఆయా పాలక వర్గాలే కొనుగోలు చేసి పిచికారీ చేయించాలని సూచించింది. దీనికి సంబంధించిన బిల్లులను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ శాఖల నిధుల నుంచి తీసుకోవాలని పేర్కొనడంతో ఆయా పాలక వర్గాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి. హైపోక్లోరైట్ పిచికారీపై ప్రజల నుంచి సైతం ఒత్తిడి పెరగడంతో ఆయా పాలక వర్గాలే బాధ్యత తీసుకొని చర్యలు చేపడుతున్నారు. పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో ట్రాక్టర్లు, వాటికి డ్రైవర్లు ఉండటంతో పారిశుధ్య కార్మికులతో కలిసి సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ద్రావణంలో 10 శాతం గాఢత ఉండడంతో లీటర్ ద్రావణంలో 10 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేస్తున్నారు.
బరిలోకి దిగిన పాలక వర్గాలు..
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగంతో కలిసి పాలక వర్గాలు నేరుగా బరిలోకి దిగాయి. అంతే కాకుండా స్థానిక ఆశ, అంగన్వాడీ, పారిశుధ్య కార్మికులతో కలిసి వైరస్ సోకిన వారి ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు. గాలిలో వైరస్ ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో బహిరంగ ప్రదేశాల్లో తిరిగి మాస్కులు పెట్టకోకపోతే వైరస్ విస్తరించే అవకాశం ఉన్నందున మాస్క్ తప్పని సరి చేసింది. అంతేకాకుండా నిబంధనలు పాటించని వారికి రూ.వేయి జరిమానా విధించాలని పంచాయతీ శాఖ ఆదేశాలు సైతం అమలు చేసే పనిలో పడ్డారు. అంతేకాక వివాహాలకు 100 మంది, చనిపోతే 20 మంది కంటే ఎక్కువ హాజరు కాకుండా చర్యలు తీసుకుంటూ ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా స్థానిక పారిశుధ్య కార్మికులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామాల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని ఆదేశించాం
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలోఅన్ని గ్రామాల వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేయమని ఆదేశాలు జారీ చేశాం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటే వారానికి రెండు, మూడు సార్లు పిచికారీ చేయమని సూచించాం. వైరస్ లక్షణాలు ఉన్నా, లేకున్నా పంచాయతీ సిబ్బంది స్థానిక ఆశ, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఆరోగ్య కిట్లు అందచేస్తాం. జిల్లాకు ఇప్పటి వరకు ఐదు వేల కిట్లు వచ్చాయి.
-విష్ణు వర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి,నల్లగొండ