కరోనా సెకండ్వేవ్ దేశవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆప్తుల్ని, సన్నిహితులను కోల్పోయిన విషాదగాథలే వినిపిస్తున్నాయి. ఈ పెనువిపత్తు నుంచి ప్రజల్ని రక్షించడానికి సినీతారలు ముందుకువస్తున్నారు. గతంలో ప్రభుత్వాలకు నేరుగా విరాళాలు అందించి చేయూతనిచ్చిన తారలు ఈసారి స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా వర్చువల్ పద్దతిలో విరాళాల సేకరణకు పూనుకుంటున్నారు. ‘ఐ బ్రీత్ ఫర్ ఇండియా’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి లారా దత్తా, శ్యామ్ వల్లభ్జీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ స్వచ్ఛంద విరాళాల సేకరణ ఉద్యమంలో బిగ్బి అమితాబ్బచ్చన్, అనిల్కపూర్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, దర్శకనిర్మాత కరణ్జోహార్, అగ్ర కథానాయిక సమంత, కృతిసనన్ తదితరులు భాగస్వామ్యులు కాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్మీడియా వేదికల మీద ప్రసారం చేయబోతున్నారు. స్వచ్ఛంద విరాళాలతో పాటు తమతో భాగస్వామ్యమయ్యే దాతలతో భారీ ఫండ్ సేకరణకు శ్రీకారం చుట్టామని కరణ్జోహార్ పేర్కొన్నారు. ‘ఐ బ్రీత్ ఫర్ ఇండియా’ కాంపెయిన్లో అభిషేక్బచ్చన్, శేఖర్కపూర్, అనుపమ్ఖేర్, శిఖర్ధావన్, రిషబ్పంత్, రవిచంద్రన్ అశ్విన్, రానా వంటి సెలబ్రిటీలు పాలుపంచుకోబోతున్నారు.