సుల్తాన్బజార్,మే 7 : కరోనా బారిన పడిన గర్భిణులకు సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సులువు ప్రసవాలు జరుగుతున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 17,536 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1010 మంది పాజిటివ్ వచ్చిందని, ఇందులో నెలలు నిండిన 95 మంది గర్భిణులకు ప్రసవాలు చేయగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వివరించారు. కరోనా వచ్చిందంటే ఆమడదూరం పారిపోతున్న ఈ సమయంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గర్భిణులు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, చక్కటి ఆహారం తీసుకోవాలని సూచించారు. కరోనా బారిన పడిన తల్లులు ప్రసవించిన చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే నిలోఫర్కు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు.