అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి
నిరాడంబరంగా అచ్చంపేట పురపాలక సభ్యుల ప్రమాణస్వీకారం
చైర్మన్గా నర్సింహగౌడ్, వైస్ చైర్పర్సన్గా పోరెడ్డి శైలజ
వీడియోకాల్లో ప్రమాణస్వీకారం చేసిన నలుగురు కౌన్సిలర్లు
అచ్చంపేట, మే 7: అచ్చంపేట మున్సిపల్పై రెండోసారి గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ అచ్చంపేట మున్సిపల్ చైర్మన్గా ఎడ్ల నర్సింహగౌడ్, వైస్ చైర్మన్గా పోరెడ్డి శైలజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ఆర్డీవో పాండునాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన తొమ్మిది మంది కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించే కేంద్రానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు, ఒకరు బీజేపీ కౌన్సిలర్ చేరుకున్నారు. ఎవరికి కేటాయించిన కుర్చీలో వారు కూర్చున్నారు. సభ్యులందరికీ మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రిసైడింగ్ అధికారి అచ్చంపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సరోజినిదేవి ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం నిరాడంబరంగా నిర్వహించారు. ఎన్నికైన 20మంది సభ్యులలో 16మందిని ప్రిసైడింగ్ అధికారి ప్రత్యక్షంగా ఒకేసారి సామూహికంగా ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా బారిన పడిన నలుగురు కౌన్సిలర్లు సోమ్లా, గోపిశెట్టి శివ, అంతటి శివ, గడ్డం రమేశ్ను వీడియో కాల్ వర్చువల్ ద్వారా ఆన్లైన్లో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మూడున్నర గంటల ప్రాంతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ నుంచి ఎడ్ల నర్సింహగౌడ్ పేరును ఆకుల లావణ్య ప్రతిపాదించగా కౌన్సిలర్ రమేశ్రావు బలపరిచారు. మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో చైర్మన్గా ఎడ్ల నర్సింహగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి పాండునాయక్ ప్రకటించారు. వైస్ చైర్మన్గా పోరెడ్డి శైలజ పేరు ఖాజాబీ ప్రతిపాదించగా కౌన్సిలర్ మనోహర్ప్రసాద్ బలపరిచారు. వైస్ చైర్పర్సన్గా పోరెడ్డిశైలజ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి ఇద్దరితో ప్రమాణస్వీకారం చేయించి ఉత్తర్వులు అందజేశారు. చైర్మన్గా, వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన నర్సింహగౌడ్, పోరెడ్డి శైలజను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కౌన్సిలర్లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి పాండునాయక్ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి పూర్తి చేశారు. డీఎస్సీ నర్సింహులు, సీఐ రామకృష్ణ, ఎస్సై రమేశ్ బందోబస్తు నిర్వహించారు. ప్రమాణస్వీకారం నిర్వహించిన పాఠశాల ఆడిటోరియంను అలంకరణతో ముస్తాబు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. బీజేపీ కౌన్సిలర్ సుగుణమ్మ బంజారా వేషధారణలో ప్రమాణస్వీకారం చేసి ఆకట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా పూర్తి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జనరల్కు రిజర్వ్ చేయడంతో బీసీ వర్గానికి చైర్మన్ పదవి కేటాయించారు. ఉద్యమకారుడు, సౌమ్యుడైన నర్సింహగౌడ్కు అవకాశం కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.