ములుగు, మే 2 (నమస్తేతెలంగాణ): అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో వేసవి పంటగా భావించే తునికాకు సేకరణకు ఆదివాసీ గిరిజనులు సిద్ధమవుతున్నారు. లక్ష్యం మేరకు ఆకు సేకరణకోసం అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కల్లాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తునికాకు సేకరణకు అటవీశాఖ అధికారులతో సంబంధిత కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా గిరిజన కూలీలు కుటుంబాల వారీగా లేదా వ్యక్తిగతంగా తునికాకు సేకరిస్తుంటారు. అందువల్ల కొవిడ్ నిబంధనలతో పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 28 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 4,5 యూనిట్లు మినహా మిగిలిన వాటిలో తునికాకు సేకరించనున్నారు.
28 యూనిట్లు.. 290 కల్లాలు
జిల్లా వ్యాప్తంగా 28 యూనిట్లలో 290 కల్లాలను ఏర్పా టు చేసి 23,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటూరునాగారం ఫారెస్టు డివిజన్లో 5 యూనిట్లను ఏర్పాటు చేసి 51 కల్లాల్లో 6,500, వెంకటాపురం(నూగూరు) డివిజన్లో 4 యూనిట్లలో 84 కల్లాల ద్వారా 2,800, తాడ్వాయి డివిజన్లో 7 యూనిట్లలో 71కల్లాల ద్వారా 5900, ములుగు ఫారెస్టు డివిజన్లో 10 యూనిట్ల ద్వారా 84 కల్లాలను ఏర్పాటు చేసి 7900 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అధికారులు నిర్దేశించుకున్నారు. ఏటూరునాగారం వన్యప్రాణి అటవీ డివిజన్లో ఏటూరునాగారం, తుపాకులగూడెం ఏ, బీ, శాపెల్లి, మొట్లగూడెం, తాడ్వాయి ఏ,బీ యూనిట్లలో తునికాకు సేకరించనున్నారు. వెంకటాపురం అటవీ డివిజన్లో చీకుపల్లి, అలుబాక, వెంకటాపురం, పేరూరు, తాడ్వాయి అటవీ డివిజన్ పరిధిలో కొడిశాల, మంగపేట, మల్లూరు, లింగాల, కాటాపూర్ ఏ, బీ, లవ్వాల, ములుగు అటవీ డివిజన్ పరిధిలో నర్సాపూర్, బూర్గుపేట, ఇంచర్ల, మల్లంపల్లి, పాలంపేట ఏ,బీ, వెంకటాపూర్, కాట్రపల్లి, పస్రా యూనిట్లలో తునికాకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ యూనిట్ల పరిధిలో అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లో కాంట్రాక్టర్లు కల్లాలు ఏర్పాటు చేసుకుని కూలీల ద్వారా తునికాకు సేకరణ చేపట్టనున్నారు.