దుబ్బాక, ఏప్రిల్ 30 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ కృషి చేస్తుంది. పంట పెట్టుబడి సాయం నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతన్నలు పండించిన పంట దళారుల పాలు కాకుండా, ఉన్న ఊర్లోనే అమ్ముకునే అవకాశం కల్పించింది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 117 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 4 కొనుగోలు కేంద్రాలు మెప్మా ఆధ్వర్యంలో, 12 పీఏసీఎస్ ఆధ్వర్యంలో, 3 మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దుబ్బాక మండలంలో 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దుబ్బాక మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో 1, దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్, చేర్వాపూర్, ధర్మాజీపేటలో మెప్మా ఆధ్వర్యంలో4, లచ్చపేట, మల్లాయిపల్లి, రఘోత్తంపల్లి, చిన్న నిజాంపేట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరో 30 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి మండలంలో 20 కొనుగోలు కేంద్రాలకు గానూ, ఒకటి ఏఎంసీ, మరోకటి పీఏసీఎస్ ఆధ్వర్యంలో.. మిగిలిన 18 ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. తొగుట మండలంలో ఒకటి ఏఎంసీ ఆధ్వర్యంలో, కాన్గల్, రాంపూర్, పెద్దమసాన్పల్లి, లింగంపేట, గుడికందుల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మిగిలిన 12 ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దౌల్తాబాద్ మండలంలో 23 కొనుగోలు కేంద్రాలకు గానూ, ఒకటి పీఏసీఎస్ ఆధ్వర్యంలో మిగిలిన 22 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాయపోల్ మండలంలో 17 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒకటి పీఏసీఎస్, 16 ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఉన్న ఊర్లోనే గిట్టుబాటు ధరకు ధాన్యం విక్రయం..
రైతులు పండించిన పంటను ఉన్న ఊర్లోనే అమ్ముకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కావల్సిన బస్తాలు, కొనుగోలు చేసిన ధాన్యం వెంవెంట రైస్మిల్లోకి తరలించేందుకు లారీలను ఏర్పాటు చేశారు. క్వింటాల్ (ఏ) గ్రేడ్ ధాన్యానికి రూ.1888, (బీ) గ్రేడ్ ధాన్యానికి రూ.1868 మద్దతు ధర కల్పించింది. రైతులు దళారులను ఆశ్రయించకుండా ఐకేపీ కేంద్రాలలోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందుతున్నారు. దుబ్బాక మండలంలో 30 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 4వందల రైతుల నుంచి 12వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఐకేపీ అధికారులు వెల్లడించారు.