లక్నో : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి చనిపోయాడంటూ పుకార్లు వ్యాపించడంతో.. అతని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి నర్సును తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రా జిల్లాలోని లోటస్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. హరిపార్వత్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇర్ఫాన్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో.. లోటస్ ఆస్పత్రిలో చేరాడు. అతను చనిపోయాడంటూ పుకార్లు వ్యాపించాయి. కానీ ఇర్ఫాన్కు ఎలాంటి ప్రాణపాయం లేదు. చికిత్స పొందుతున్నాడు. ఇది గమనించని అతని బంధువులు.. పుకార్లను నమ్మి ఆస్పత్రిపై ఇనుపరాడ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నర్సుపై టేబుల్ ఫ్యాన్, హెల్మెట్తో దాడి చేశారు. దీంతో ఆమె స్పృహ తప్పి కిందపడిపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.