భోపాల్: కరోనా రోగి అయిన తల్లికి ఆక్సిజన్ అందించాలని కోరిన ఒక వ్యక్తికి రెండు చెంప దెబ్బలు ఇస్తానని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన మధ్యప్రదేశ్లోని దామోహ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చిన దామోహ్ జిల్లా ఆసుపత్రిని ప్రహ్లాద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కరోనా రోగులకు ఆక్సిజన్ అందని విషయాన్ని ఒక వ్యక్తి కేంద్ర మంత్రికి తెలిపారు. తన బంధువైన కరోనా రోగికి ఆక్సిజన్ అందించడం లేదని, తాము చాలా నిరాశతో ఉన్నామని ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన ప్రహ్లాద్.. ” నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు రెండు చెంప దెబ్బులు ఇస్తా..” అని అన్నారు. దీంతో ఆ వ్యక్తి ఏడ్చాడు. ” అవును నాకు చెంప దెబ్బలే దక్కుతాయి. నా తల్లి అక్కడ పడి ఉన్నది ” అని చెప్పాడు. దీంతో, ఆక్సిజన్ ఎవరు నిరాకరించారు.. అని కేంద్ర మంత్రి ఆ వ్యక్తిని ప్రశ్నించగా, ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారని తెలిపారు. ఒక ఆక్సిజన్ సిలిండర్ మాత్రమే ఉందని, ఐదు నిమిషాలు మాత్రమే అందిస్తున్నారని చెప్పాడు.
మరోవైపు మంగళవారం ఆక్సిజన్ కొరతపై ఆగ్రహం చెందిన కరోనా రోగి బంధువులు ఆసుపత్రిలోని స్టోర్ రూమ్పై దాడి చేసి అందులోని ఆక్సిజన్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. అయితే ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని, సిలిండర్లు సరిపడా ఉన్నాయని ఈ ఘటన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.