చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ సీజన్లో సమిష్టిగా రాణించడంలో
విఫలమవుతున్న సన్రైజర్స్ హ్యాట్రిక్ ఓటములతో ఒత్తిడిలో ఉంది. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. పంజాబ్తో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గెలుపు బాట పట్టాలని వార్నర్సేన భావిస్తోంది. చెన్నైలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రైజర్స్ ఛేదనలో చేతులెత్తేసింది.
టాస్ గెలిచిన పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.పంజాబ్ జట్టులో 3 మార్పులు చేసింది. మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, హెన్రిక్స్కు తుది జట్టులో చోటు దక్కింది. ఆల్రౌండర్ కేదార్ జాదవ్ సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. హైదరాబాద్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చేశాడు. గాయం కారణంగా దూరమైన సమద్ స్థానంలో జాదవ్, మనీశ్ పాండే స్థానంలో సిద్ధార్థ్ కౌల్, ముజీబ్ రెహమాన్ స్థానంలో విలియమ్సన్ను ఎంపిక చేసినట్లు వార్నర్ వెల్లడించాడు.