కొన్ని నిజాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. నిప్పును కప్పేసిన నివురు చాలా సమయం అలాగే ఉంటే, ఆ తర్వాత నివురు వదిలేసరికి నిప్పు నీరుగారినట్లవుతుంది. నిజం గూడా అంతే! నిప్పులాంటిదే!! బయటపడ్డాక ‘నిజం’ విలువ పట్టించుకోము. అది సాధారణ పరిణామంగా మారినందువల్లే బాధ కలుగుతుంది.
వ్యక్తిగతంగా నారాయణన్ లాంటి సైంటిస్టు ఆత్మాభిమానాన్ని కోల్పోవటం ఒక ఎత్తయితే ఆయన సహకరించదలచుకున్న, అప్పుడు పనిచేస్తున్న క్రయోజెనిక్ ప్రొపల్షన్ ప్రాజెక్టు ఈ స్పై కేసు వల్ల ఆగిపోయింది. దేశానికి ఆ విధంగా స్పేస్ రిసెర్చ్ విషయంలో తీరని నష్టం సంభవించింది.
1994 నవంబర్ 30 నాడు పెను సంచలన వార్త మన దేశాన్ని కుదిపేసింది. అపరాధ పరిశోధక నవలలు, కథలు చదివేవాళ్లంతా తెగ ఉత్సాహపడిన వేళ! పోలీసులు ఇస్రో సంస్థలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న ఎస్ నంబి నారాయణన్ను, మరో ఇద్దరు సైంటిస్టులను అరెస్టు చేశారు. వారు దేశ అత్యంత విలువైన అంతరిక్ష రహస్యాలను ఇతర దేశాలవారికి చేరవేశారంటూ, ఆ వైనం బట్టబయలు చేసి, వారిని అరెస్టు చేసి దేశ సున్నిత రహస్యాలను కాపాడగలిగామని బీరాలు పలికారు. నంబి నారాయణన్- ‘నేను అలాంటివాడిని ఎంతమాత్రం కాదు’ అని దుఃఖంతో దీనాలాపన చేసినా ఎవరు పట్టించుకోలేదు ఆనాడు. ఆ దయనీయ స్థితిని నారాయణన్ భరించాడు. ఆయన కొడుకులు, బంధువులు ఎంతో వేదనతో ‘నీకు నువ్వే నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి’ ఇదని చెప్పి, వెన్ను తట్టి అండదండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో మానవ హక్కుల సంఘాలు, మేధావులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు.
ఆరోజు నుంచి నంబి నారాయణన్కూ, పోలీసులకూ, రాజకీయులకూ యుద్ధం అనివార్యంగా మారింది. అత్యంత సాహసోపేతమైన, చరిత్ర లిఖించదగ్గ ఒక సామాన్య సైంటిస్టు గాథ ఆనాటి నుంచి మొదలైంది. ‘న్యాయం ఆలస్యమైతే న్యాయం జరుగనట్లే’ అన్న నానుడి ఈ నంబి నారాయణన్ కేసుకు సరిగ్గా సరిపోతుంది. కేవలం ఇలాంటి కేసులు ఒకటో రెండో అడపాదడపా మన దృష్టికి వస్తుంటాయి. ఇప్పటికైనా రెండు మూడు అంశాలు అందరూ ఆలోచించాల్సిన అవసరం గుర్తించాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)- స్పేస్కు సంబంధించిన రిసెర్చ్తోబాటు, అంతర్జాతీయంగా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో నాసాతో పోటీపడే రీతిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ సున్నిత సమస్య తలెత్తింది. మాల్దీవులకు సంబంధించిన ఇద్దరు (మరియం రషీదా, ఫౌజియా హసన్) పట్టుబడటంతో నారాయణన్తోబాటు మరో సైంటిస్ట్ శశికుమార్ కూడా ‘అఫీషియల్ సీక్రెట్స్’ను ఇతర దేశాలకు వారి ద్వారా అందించడంలో తోడ్పడ్డారని లింక్ చేయబడ్డారు. ఆ తర్వాత కేరళ పోలీసుల పరిశోధన లోపభూయిష్టంగా ఉందని కేసును సీబీఐ చేపట్టి నారాయణన్కు సంబంధం లేదని తేల్చిచెప్పింది. మానవ హక్కుల కమిషన్ కూడా అప్పట్లో రూ.10లక్షలను నష్టపరిహారంగా ఇప్పించింది. ఎట్టకేలకు పరువుపోయినా ఫలితం కొంతలో కొంత దక్కినట్లు సుప్రీంకోర్టు- సీబీఐ రిపోర్టు ఆధారంగా రూ.50లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టపరిచింది. అప్పట్లో కేరళ ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
వ్యక్తిగతంగా నారాయణన్ లాంటి సైంటిస్టు ఆత్మాభిమానాన్ని కోల్పోవటం ఒక ఎత్తయితే ఆయన సహకరించదలచుకున్న, అప్పుడు పనిచేస్తున్న క్రయోజెనిక్ ప్రొపల్షన్ ప్రాజెక్టు ఈ స్పై కేసు వల్ల ఆగిపోయింది. దేశానికి ఆ విధంగా స్పేస్ రిసెర్చ్ విషయంలో తీరని నష్టం సంభవించింది. నాసాతో సరిసమానంగా ఇస్రోను నిలబెట్టాలని గాఢంగా కృషిచేసిన సైంటిస్టులలో నారాయణన్ ఒకరు. ‘కాంపెన్సేషన్ నాకు ముఖ్యం కాదు. నా ఆత్మాభిమానం కోల్పోయినా, ఒక మంచి ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురయిందనే మా సైంటిస్టుల బాధ’ అని విచారంతో మీడియాకు చెప్పటం గమనార్హం. నంబి నారాయణన్ కేసులో అడ్డగోలుగా ఇన్వెస్టిగేషన్ చేసినందుకు అప్పటి పోలీసు అధికారులను శిక్షించాలని సీబీఐ తన విచారణలో తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఏకీభవించి జైన్ కమిషన్ను నియమించింది. అయితే విచారణాంశాలను సీబీఐ బయటకు పొక్కనివ్వలేదు. అది వేరే విషయం.
1994లో జరిగిన కేసు 2021 వరకు కూడా ఇంకా పరిష్కార దశ దాటి శిక్షార్హులకు ఎలాంటి శిక్షలు విధించాలనే ఆలోచనకు సంబంధించిన ఎంక్వైరీ దగ్గరే ఉండటం, మన దేశంలోనే జరుగుతుందని కొందరు అభిప్రాయపడటాన్ని తప్పుపట్టలేం! ప్రజాస్వామ్యంలో పాలకుల పాత్ర ఎంత ముఖ్యమో చట్టాలను అమలుచేసేవారి, అన్వయించేవారి పాత్రగూడా అంతే ముఖ్యం. తమవారికి శిక్షపడకుండా ఉండటం కోసం వందమంది దోషులను ఏదో ఒక నెపం మీద వదిలేయటం భావ్యం కాదు. అదేవిధంగా నిర్దోషిని సాక్ష్యాలు లేకపోయినా చిత్రహింసలు పెట్టి, అమానుషంగా రాజుల కాలంలో మాదిరి శిక్షించటం తగదు. ఈనాటి పాలకులు ప్రతి క్షణం తమదే బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తేనే రాజ్యాంగానికి, రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అంగాలకూ, వ్యవస్థలకు ఒక అర్థమూ, ప్రయోజనమూ ఉంటుంది. సుప్రీంకోర్టు 2018లో చారిత్రాత్మకమైన తీర్పు తనకు అందజేసినప్పుడు నారాయణన్ మీడియావారితో ఒక మాట చెప్పారు- ‘నేను ఈ ఇరవై అయిదు సంవత్సరాలు నరకం అనుభవిస్తూ, నా కుటుంబసభ్యులతో నిర్వేదంగా కాలం గడిపాను. ఈ తీర్పుతో నేను సంతోషంగా, గౌరవంగా మిగిలిన జీవితకాలాన్ని వారితో గడపదల్చుకున్నాను. ఒక సైంటిస్టుగా ఈ వయసులో నేను బహుశా దేశానికి ఉపయోగపడే అవకాశం లేదేమో! నా అమూల్యమైన ఉద్యోగకాలం ఆ విధంగా చేజారిపోయినందుకు నన్నెప్పుడూ విచారం వెన్నాడే ఉంటుంది’. నంబినారాయణన్కు భారత ప్రభుత్వం 2019లో ‘పద్మభూషణ్’ బిరుదును ప్రదానం చేసింది. అది ఒకవిధంగా ఆశించని అనుకోని ఆనందమే!
రావులపాటి
సీతారాంరావు