జమ్మూ : జమ్మూకాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో మంగళవారం శార్దియా నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. త్రికూట పర్వతంపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం కొవిడ్ మహమ్మారి నీడన వేడుకలకు దేవస్థానం బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాలు, గులాబీలు, ఆర్కిడ్, బంతి పువ్వులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. ఎస్ఎంవీడీఎస్బీ సీఈఓ రమేశ్ కుమార్ భక్తుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కత్రా, దర్శని దేయోడి, బంగంగా, అధ్కువారి, తారకోట్ మార్గ్, సంజిచాట్, హిమ్కోటి, భవన్, భైరోన్ కాంప్లెక్స్లను పరిశీలించారు.
కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను శానిటైజేషన్ చేయడంతో పాటు భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. శార్దియా నవరాత్రి సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి హారతి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కళాకరులు భజనలతో పాటు భైంట్ ప్రదర్శనలు చేపట్టానున్నారు. అలాగే లోక కల్యాణార్థం శత చండి మహాయాగం సైతం నిర్వహించనున్నారు. ఉత్సవాలను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది.