న్యూఢిల్లీ: విమానంలో ఒక వ్యక్తి దుస్తులు విప్పి క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న ఐ5-722 విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. అందులోని ఒక ప్రయాణికుడు లైఫ్ జాకెట్ కోసం విమాన సిబ్బందితో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన దుస్తులు విప్పి అర్థ నగ్నంగా మారాడు. ఆ వ్యక్తి అనుచిత ప్రవర్తనకు విమానంలోని మిగతా ప్రయాణికులు షాక్ అయ్యారు.
కాగా, పైలట్ ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం ల్యాండ్ కాగానే సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు. విమానంలో దుస్తులు విప్పి అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఎయిర్ ఏషియా సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చేందుకు సిద్ధమవుతున్నది.