వరంగల్ : వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర చీఫ్ విప్దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని ప్రసంగించారు.
ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్కు మద్దతు పలకడం దీనికి నిదర్శనమన్నారు. నేటి వరకు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
రానున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికలకు మంత్రి శంఖారావం పూరించారు. ఓరుగల్లు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగాలు కల్పించే వరంగల్ కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా, గిరిజన యూనివర్శిటినీ ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు.
వరంగల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఇటీవల రూ. 250 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారికి ప్రమాద బీమా చేయిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ సంక్షేమ, అభివృద్ధికి పాటుపడే దాస్యం వినయ్ భాస్కర్ కు మీ మద్దతు ఇలాగే కొనసాగించాలని కోరారు.
సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఇతర ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.